కరోనా వేక్సిన్ పట్ల అపోహలు విడనాడాలని, ప్రతీఒక్కరూ తప్పనిసరిగా వేక్సిన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కోరారు. మూడోవిడత వేక్సినేషన్ ప్రక్రియను విజయనగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు ఎంతమందికి వేక్సిన్ వేయించినదీ, రిజిష్ట్రేషన్ ప్రక్రియపై ఆరా తీశారు.కరోనా వేక్సిన్ రెండో డోసును వేయించుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, 60 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ మూడోదశలో కరోనా వేక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా బీపీ, షుగర్ తదితర కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు నుంచి 60 ఏళ్లు లోపువారికి కూడా వేక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. వేక్సిన్ కావాల్సినవారు ముందుగానే ఆన్లైన్లో తమ పేర్లను రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు.
వేక్సిన్ వేసుకున్నందువల్ల ఎటువంటి దుష్ఫలితాలు కలగవని, కొద్దిమందికి మాత్రమే నీరసం, జ్వరం లాంటి కొద్దిపాటి లక్షణాలు కనిపించవచ్చని చెప్పారు. వైద్యులు సూచించిన వారు మినహా, మిగిలిన వారంతా వేక్సిన్ వేయించుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.జిల్లాలో వేక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటి విడత వైద్యారోగ్యశాఖ సిబ్బంది 17వేల మందికి వేక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు సుమారు 13 వేలమందికి వేయడం జరిగిందని చెప్పారు.
రెండో విడతలో రెవెన్యూ, పంచాయితీరాజ్, మున్సిపల్ తదితర ఫ్రంట్ లైన్ వర్కర్స్ సుమారు 25వేలమందికి వేక్సినేషన్ ప్రారంభించగా, ఇప్పటివరకూ పదివేల మందికి వేయడం జరిగిందన్నారు. తాజాగా సుమారు 3వేలమంది పోలీసులకు కూడా వేక్సినేషన్ ను ప్రారంభించామన్నారు. మూడోవిడత క్రింద మార్చి 1 నుంచి జిల్లా వ్యాప్తంగా వేక్సినేషన్ జరుగుతోందన్నారు.
దీనికోసం 42 వేక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విజయనగరం పట్టణంలో 9 ప్రైవేటు హాస్పటల్స్ ద్వారా వేక్సిన్ వేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎల్.రామ్మోహన్ కూడా వేక్సిన్ రెండో డోసును వేయించుకున్నారు. డిప్యుటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ చామంతి, వైద్యాధికారి డాక్టర్ లావణ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఎం. భరత్ కుమార్, సత్యం న్యూస్