ఇండియా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఈ దేశం హిందువులకు మాత్రమే సొంతం కాదు అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ పాత బస్తీలోని దారూస్సలామ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
దేశ ప్రజల మధ్యలో గాంధీ లేడు కానీ గాంధీ జ్ఞాపకాలు ఉన్నాయి. అంబెడ్కర్ లేడు కానీ ఆయన రాజ్యాంగం మనలో ఉంది. దేశాన్ని రక్షించాల్సిన భాద్యత ప్రజలందరి పై ఉంది అని ఆయన తెలిపారు. ఈ పౌరసత్వ చట్టం తీసుకురావడం అంటే గాంధీ, అంబెడ్కర్, అబ్దుల్ కలాం ని అవమానించినట్లే. ఇది నా దేశం..దేశం కోసం నా ప్రాణాలు అయినా ఇస్తాను…బంగ్లాదేశ్, పాకిస్తాన్, అప్గానిస్తాన్ తో నాకేమి సంబంధం అంటూ ఆయన ఆవేశంగా ప్రశ్నించారు.
స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తరువాత నేను భారతీయుణ్ణి అని నిరూపించుకోవాలనడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఎన్ ఆర్ సి వల్ల దేశంలో ప్రతి ఒక్కరూ లైన్ లో నిల్చోవాలి…దేశంలో కేవలం 4శాతం మాత్రమే పాస్ పోర్ట్ ఉన్న ప్రజలు ఉన్నారు..దేశంలో ఉన్న ముస్లిమ్ పేరు ఎన్ ఆర్సీ లో లేకపోతే అతను అతని కుటుంబం ఎక్కడికి వెళ్లాలి? అని ఆయన ప్రశ్నించారు.
ఎన్ ఆర్సీ వల్ల నష్టం తప్ప లాభం లేదు..రాష్ట్రాలకు రాష్ట్రాలను ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. దేశంలో ప్రజలను బీజేపీ రెచ్చకొడుతుంది. నేను ఉన్నంత వరకు ఒక్క ముసల్మాన్ కు అన్యాయం జరగనివ్వను అని ఆయన అన్నారు. మరణం వరకు వస్తే ముందు నేను ప్రాణాలను వదులుతానని ఓవైసీ అన్నారు.
దేశంలో ఉన్న ప్రతి ముస్లిం ఇంటి పై జాతీయ జెండా ఎగరేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ జాతీయ జెండాను మోడీ, అమిత్ షా చూడాలని ఆయన అన్నారు. ఇది నా దేశం అని ఆయన సభలోని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.