ఆంధ్రప్రదేశ్ లో క్షేత్ర స్థాయిలో వస్తున్న స్పందన చూసిన బీజేపీ ఈ సారి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ చేస్తున్న దర్యాప్తు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకూడదని నిర్ణయించినట్లు తెలిసింది.
ఇప్పటి వరకూ ఈ హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ సోదరుడు, కడప పార్లమెంటు సభ్యుడు వై ఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా కేంద్రంలోని బీజేపీ కాపాడుతున్నదనే అపోహ ఏపి ప్రజల్లో ఉంది.
ఈ అపోహకు తగ్గట్టుగానే అవినాష్ రెడ్డి అరెస్టుకు న్యాయస్థానాలు అభ్యంతరాలు చెప్పకపోయినా కూడా సీబీఐ అరెస్టు చేయడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్ప ఇప్పటి వరకూ న్యాయస్థానాలు అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకోలేదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా మరో రెండు రోజుల్లో ముగుస్తాయి.
ఈ నేపథ్యంలో సీబీఐ తాత్సార వైఖరి అవలంబిస్తున్నందున అది కేంద్రంలోని బీజేపీపైనే అనుమానాలు రేకెత్తిస్తున్నది. అవినాష్ రెడ్డి అరెస్టు వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లడం, అక్కడ ప్రధాని మోదీని, హో మంత్రి అమిత్ షా ను కలవడం జరుగుతున్నది. అధికారికంగా తాము ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు,
పోలవరం ప్రాజెక్టు కోసం కలుస్తున్నామని చెబుతున్నా ఈ సమావేశాలలో మాట్లాడుతున్నది బాబాయి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినవేనని చాలా మంది నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ సీఎం జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సారి సీబీఐ తన వాదనలో సీఎం జగన్ పేరు కూడా ప్రస్తావించింది.
తన పేరు ప్రస్తావనకు రావడం, సీఎం జగన్ హో మంత్రిని కలవడంతో మళ్లీ ఇదే అంశంపై చర్చించారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఈ సారి మాత్రం జగన్ కు ‘‘మేమేం చేయలేం’’ అనే సమాధానం వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే సీబీఐ త్వరలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తున్నది.