పార్టీని నిలువునా ముంచెయ్యడానికి ఇలాంటోళ్లు ఒక్కరు చాలు. ఈ ఆడియో జనంలోకి పోతే మిగిలిన కొద్దిపాటి పరువు ఆవిరయినట్లే. పట్టణంలో అడ్డదిడ్డంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని అధికారికి ఫిర్యాదు చేస్తే కాళ్లు చేతులు విరిచేస్తారా ! ఇలాంటి వాళ్లను పార్టీలోకి తీసుకొని ప్రజలకు ఏం సంకేతమిస్తున్నారు ! పైగా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.
తూర్పు గోదావరి జిల్లా మండపేట వైసీపీ ఇన్చార్జి తోట త్రిమూర్తులు నిన్న మొన్నటిదాకా టీడీపీలో ఉన్నారు. పార్టీ బలోపేతం కోసం ఆయన్ని ఇటీవలనే సీఎం వైఎస్ జగన్ పార్టీ తీర్థమిచ్చారు. ఆయన వాలకం తెలిసి కూడా పార్టీలోకి తీసుకోవడాన్ని దళిత వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దళితుడి శిరోముండనం కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న నేతకు పార్టీలో ప్రాధాన్యం కల్పించడాన్ని జీర్నించుకోలేకపోతున్నారు.
ఎంపీ పిల్లి సుభాస్ చంద్రబోస్తో రాజకీయంగా వైరం ఉండొచ్చు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పొసగక పోవచ్చు. ప్రజలతో వ్యవహరించే తీరు సక్రమంగా లేకుంటే పలచనవుతారు. పార్టీలో తనకు ఇష్టం లేని వాళ్లు, తన నాయకత్వాన్ని విబేధించే వాళ్లను కన్విన్స్ చేసుకోవడం నాయకుడి లక్షణం.
దీనికి భిన్నంగా కాళ్లు చేతులు విరిచేస్తామంటూ బెదిరించడం అనాగరికం. ఇది అధికార పార్టీ కార్యకర్త విషయంలో ఈ నేత వ్యవహారశైలికి నిదర్శనం. ఇదే కాదు. గతంలో ఇజ్రాయేలు అనే ఓ దళిత కార్యకర్త సదరు నేతను చెప్పుతో కొట్టిన సంఘటన ప్రజల జ్ఞాపకాల్లో సజీవంగా ఉంది.
అనంతరం అతనిపై తప్పుడు కేసులు నమోదు చేయించడం, హత్యాయత్నానికి పాల్పడడం కొసమెరుపు. తోట త్రిమూర్తులను పార్టీలోకి తీసుకోవడమే పెద్ద తప్పని భావిస్తే.. పైగా ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని పార్టీ యంత్రాంగానికి మింగుడు పడడం లేదు.
ప్రధానంగా అణగారిన వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి ఇన్చార్జితో మండపేటలో పార్టీ పరువు మంటగలవడం ఖాయమని నోటిమీద వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం కళ్లు తెరవడం మంచిది. లేకుంటే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని జనం ఛీ కొట్టే దశకు చేర్చడం ఖాయం.