హ్యూమన్ రైట్స్ ముసుగులో సెటిల్మెంట్లు, దందాలు, బెదిరింపులకు పాల్పడుతున్న ఓ మహిళ, విలేకరిని హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కారు, పల్సర్ బైక్, హ్యూమన్ రైట్ లెటర్ ప్యాడ్స్, మెంబర్ షిప్ సర్టిఫికెట్లు, స్టాంపులు, సెటిల్మెంట్, భూపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ పోలీస్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ జీ మీడియాకు వివరాలను వెల్లడించారు. హనుమకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన బీమయ్య ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే బీమయ్య మరణంపై బంధువులు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రిలోని మార్చురీకి తరలిస్తుండగా హనుమకొండ ఎస్సై రాజుకు ఓ కాల్ వచ్చింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన హ్యూమన్ రైట్స్ కమిటీ మెంబర్ తాటికల క్రాంతికుమార్ ఓ వ్యక్తి తరపున ఎస్సైకి కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడి బెదిరించాడు. క్రాంతికుమార్ విలేకరిగా పనిచేస్తున్నాడు. ఎస్సై రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరపగా క్రాంతి కుమార్ పై హైదరాబాదులోని పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయని తేలింది. అలాగే వరంగల్ రంగసాయిపేటకు చెందిన మహిళ బుంగ జ్యోతీరమణ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర గవర్నర్ పేరుతో న్యాయవాదులు రవి, సంజయ్ తో కలిసి ఒక ముఠాగా ఏర్పడి పలు హోదాల పేర్లు చెప్పి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఫోన్లు చేసి బెదిరించినట్లు విచారణలో వెల్లడైంది. సెటిల్మెంట్లు, బెదిరింపుల వంటి దందాలు చేసినట్లు తేలింది. ఈ క్రమంలో న్యాయవాదులపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో హనుమకొండ పోలీసులు మంగళవారం క్రాంతికుమార్, బుంగ జ్యోతిరమణని అరెస్టు చేశారు. హ్యూమన్ రైట్స్ ముసుగులో సెటిల్మెంట్లు, దందాలు, బెదిరింపులకు పాల్పడటం వల్లే వీరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.