కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. రావులపాలెం మండలం కొమర్రాజులంక కు చెందిన అప్పన్న సత్యవతి(55), వెంకటలక్ష్మి(40), మహేష్(20) ముగ్గురు మృతి చెందారు.
సత్యవతి కుమారుడు నాగేశ్వరరావు మరొక మహిళతో కలిసి కొత్తపేటలో ఉండడంతో భార్య వెంకటలక్ష్మి కుమారుడు మహేష్ తో కలిసి నాగేశ్వరరావు తల్లి సత్యవతి ముగ్గురు ద్విచక్రవాహనంపై కొత్తపేట వెళ్లి నాగేశ్వరరావుతో ఘర్షణపడ్డారు.
ఈ ముగ్గురు తిరిగి శుక్రవారం అర్ధరాత్రి కొమర్రాజు లంక వస్తుండగా మందపల్లి వద్దకు వచ్చేసరికి రావులపాలెం వైపు నుండి కొత్తపేట వైపు వెళ్తున్న పాల వ్యాన్ వీరి వాహనాన్ని బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలను కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.