కొవ్వూరి సురేష్రెడ్డి… యానిమేషన్ గేమింగ్ రంగంలో ఈ పేరు సుపరిచితమే. అంతే కాదు ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార పత్రిక ఫోర్బ్స్ ఇటీవల 30 ఏళ్ళ లోపు వయసు గల అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను ప్రకటించింది. అందులో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త, ఏకైక తెలుగు వ్యక్తి సురేష్రెడ్డి.
గత 13 ఏళ్ళుగా ‘క్రియేటివ్ మెంటార్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజీ’ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ఉన్నారు. ఆ కాలేజీ వ్యవస్థాపకులు ఆయనే. అలాగే, ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిలిం స్కూల్ నిర్వహిస్తున్నారు. ఎంతోమంది యానిమేటర్లుగా ఎదగడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది.
‘పి19 ఎంటర్టైన్మెంట్’ సంస్థ ప్రారంభం
అటువంటి సురేష్రెడ్డి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ‘పి19 ఎంటర్టైన్మెంట్’ సంస్థను స్థాపించిన ఆయన, శుక్రవారం నాడు మూడు చిత్రాలను ప్రకటించారు. ‘పి19 ఎంటర్టైన్మెంట్’లో ప్రొడక్షన్ నెం1గా రూపొందనున్న చిత్రానికి ‘సూపర్స్టార్ కిడ్నాప్’, ‘పేపర్ బోయ్’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ఆకాష్రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.
‘ఛోరి’, ‘మరోజన్మ’, ‘ప్యూర్ సోల్’ వంటి అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్స్ రూపొందించిన ఆకాష్రెడ్డి, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘పి19 ఎంటర్టైన్మెంట్’లో ప్రొడక్షన్ నెం2గా రూపొందనున్న చిత్రానికి ఉత్తమ కథారచయితగా ‘ఋషి’కి గాను నంది పురస్కారంతో పాటు దర్శకుడిగా దాదా సాహెబ్ ఫాల్కె ఫిల్మ్ ఫెస్టివల్లో పురస్కారం అందుకున్న రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించనున్నారు.
‘ఋషి’ చిత్రానికి పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. ‘ఆంధ్రాపోరి’, ‘ఐతే 2.0’ చిత్రాలకు రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎన్నారై రవికాంత్ జామితో కలిసి సురేష్రెడ్డి కొవ్వూరి నిర్మించనున్నారు.
‘పి19 ఎంటర్టైన్మెంట్’లో ప్రొడక్షన్ నెం3గా రూపొందనున్న చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు, ఆయన దగ్గర ఆరు చిత్రాలకు పని చేసిన ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు ‘పెళ్ళి గోల’ వెబ్ సిరీస్, జీ5 ఓటీటీలో ఎక్స్క్లూజివ్గా విడుదలైన ‘47 డేస్’ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. దీనికి రమేష్ ప్రసాద్ సమర్పకులు.
మూడు చిత్రాల ప్రీలుక్స్, లోగోల విడుదల
హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ మూడు చిత్రాలను ప్రకటించారు. మూడు చిత్రాల ప్రీలుక్స్, లోగోలను కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రసాద్స్ గ్రూప్ చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఆవిష్కరించారు.
ప్రముఖ ఆర్థోపెడిక్స్ డాక్టర్ దశరథరామిరెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ కె.ఎల్. దామోదర ప్రసాద్, నిర్మాత రాజ్ కందుకూరి, జీ5లో హెడ్ క్రియేటివ్ & కంటెంట్ యాక్వేషన్ నిమ్మకాయల ప్రసాద్, దర్శకులు రాజ్ మాదిరాజు, ప్రదీప్ మద్దాలి, ఆకాష్రెడ్డి, ‘పీ19 ఎంటర్టైన్మెంట్’ అధినేత కొవ్వూరి సురేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంపాదించినదంతా సినిమాల్లోనే పెట్టారు ఎల్ వి ప్రసాద్
సినిమా లోగోలు ఆవిష్కరించిన అనంతరం రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మా నాన్న ఎల్వీ ప్రసాద్గారే. ఆయన సంపాదించినదంతా సినిమాల్లోనే పెట్టారు. మాకు హైదరాబాద్, చెన్నైలో స్టూడియోలు ఉన్నాయి. ముంబై, కలకత్తాలో ఆఫీసులు ఉన్నాయి.
నా జీవితమంతా సినిమాతో ముడిపడి ఉంది. మేం ప్రసాద్ ప్రొడక్షన్స్లో కొన్ని సినిమాలు నిర్మించాం. ఇంకా నిర్మిస్తాం. మేం చిత్రనిర్మాణం కొనసాగించాలని అనుకుంటున్నాం. ఈ రోజు మూడు చిత్రాలు ప్రారంభించడం సంతోషంగా ఉంది.’’ అని అన్నారు.
‘దిల్’ రాజు మాట్లాడుతూ రమేష్ ప్రసాద్ 84 ఏళ్ళ వయసులో మూడు సినిమాల ప్రొడక్షన్ మొదలుపెట్టడం మామూలు విషయం కాదని అన్నారు. ఎల్వీ ప్రసాద్గారు సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలను రమేష్ ప్రసాద్ ఇప్పటికీ కొనసాగిస్తున్నందుకు థ్యాంక్స్ చెబుతున్నాను అన్నారు.
సినిమాల్లోకి రావద్దని చెప్పిన వారే ఎంకరేజ్ చేశారు
కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ‘‘మా నాన్నగారికి రమేష్ ప్రసాద్గారు క్లోజ్ ఫ్రెండ్. నేను సినిమాల్లోకి వస్తానంటే రావొద్దని చెప్పిన తొలి వ్యక్తి ఆయనే. వచ్చిన తర్వాత ఎంకరేజ్ చేసిన వ్యక్తి కూడా ఆయనే. ఇవాళ్టి రోజున కొత్తవాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడమనేది ఎంత కష్టమైన పనో, ఎంత రిస్క్తో కూడుకున్నదో అందరికీ తెలిసిందే.
ఎందుకంటే… పదేళ్ళుగా నేను చేస్తున్నది అదే. సురేష్గారి లాంటి కొత్త నిర్మాతకు రమేష్ ప్రసాద్ వంటి బ్యాకింగ్ రావడం మంచి విషయం. సురేష్గారు ఫోర్బ్స్లో చోటు దక్కించుకున్నారు. ఈ ఇండస్ట్రీకి ఫైనాన్షియల్ డిసిప్లెన్ అవసరం. ఆయన లాంటి వాళ్ళు, ఎన్నారైలు రావడం వలన ఆ డిసిప్లెన్ వస్తోందని అన్నారు.
కంటెంటే సినిమాకు కింగ్
సురేష్రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ ‘‘బ్లెస్సింగ్స్ అందించిన రమేష్ ప్రసాద్గారికి థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన అతిథులు అందరికీ థ్యాంక్స్. మేం రెండేళ్ళ నుండి ఎన్నో కథలు విన్నాం. మాకు స్టోరీలు నేరేట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. వరల్డ్ సినిమాకి తెలుగు సినిమా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తోంది.
ఎంతోమంది యంగ్ ట్యాలెంటెడ్ పీపుల్ వస్తున్నారు. నేను ‘కంటెంట్ ఈజ్ ది ఫిల్మ్ (కింగ్)’ అనేది నమ్ముతాను. వచ్చే నాలుగేళ్ళల్లో 20 చిత్రాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ మూడు సినిమాల విషయానికి వస్తే… మా దర్శకులు ముగ్గురూ ఆల్రెడీ తమ కథలతో ఇంతకు ముందే ప్రూవ్ చేసుకున్నారు.
వాళ్ళ కథలపై నమ్మకంతో సినిమాలు ప్రారంభించాం. ప్రదీప్ మద్దాలి సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న మొదలుపెట్టి, మార్చి 15కి పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాం.
రాజ్ మాదిరాజు సినిమా చిత్రీకరణ ఈ ఏడాది డిసెంబర్ 22న మొదలవుతుంది. వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకి పూర్తవుతుంది. ఆ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాం. ఆకాష్రెడ్డి సినిమా చిత్రీకరణ నవంబర్, డిసెంబర్ నెలల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని అన్నారు.