ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తున్న విచ్చలవిడి అప్పుల గురించి బయటి ప్రపంచానికి తెలుస్తున్నదినే కారణంగా ముగ్గురు ఉద్యోగులను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక శాఖ చెందిన ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు.
ఆర్థికశాఖ సెక్షన్ అధికారులుగా పనిచేస్తున్న డి.శ్రీనిబాబు, కె.వరప్రసాద్, సహాయ కార్యదర్శిగా ఉన్న నాగులపాటి వెంకటేశ్వర్లును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆర్థికశాఖకు సంబంధించి సమాచారం లీక్ చేస్తున్నారన్న అభియోగంపై ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రభుత్వ అనుమతి లేకుండా ముగ్గురు హెడ్క్వార్టర్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులలో ఒక్క సారిగా భయం, ఆందోళన కలుగుతున్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని భయపడుతున్నారు.
తమంటే గిట్టని వారు ఏదైనా ఫిర్యాదు చేస్తే ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు. ఆర్ధిక శాఖ లో ఉద్యోగులను సస్పెండ్ చేయడం, అదీ కూడా సమాచారం లీక్ కారణం చూపడం అన్యాయమని వారు అంటున్నారు.
ప్రభుత్వం అప్పులు తీసుకుంటున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసునని అందుకు ఉద్యోగులను బాధ్యులను చేయడం కరెక్టు కాదని అంటున్నారు.