హిందువుల పట్ల వై ఎస్ జగన్ ప్రభుత్వం విద్వేషం కక్కుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పండుగలు, పర్వదినాలు వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో రుసుములను భారీగా పెంచేసి భక్తులకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తున్నదని ఆయన అన్నారు. అభిషేకం తదితర టిక్కెట్ రేట్లు పెంచడం ద్వారా భక్తులు ఎక్కువ మంది రాకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పవిత్ర పుణ్య క్షేత్రమైన కాణిపాకంలో దసరా రోజున అభిషేకం ధర ఏడు రెట్లు పెంచడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. రూ. 750 నుంచి రూ. 5000 పెంచుతూ నిర్ణయం తీసుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇటువంటి విఘాత నిర్ణయాలు పర్వదినాన్న తీసుకోవడం వెనుక హిందూ ద్వేషాన్ని వైసీపీ ప్రభుత్వం వెళ్ళగక్కుతోందని దుయ్యబట్టారు. అభిషేకంపై పెంచిన ధరను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ద్వారకా తిరుమలకు వచ్చే భక్తులకు కేవలం పులిహోరతో సరిపెడుతున్నారని, చక్రపొంగలి, వడ తదితరాలు పర్వదినాల్లో ఎందుకు అందుబాటులో ఉంచడం లేదని సోము వీర్రాజు అన్నారు.