రాజన్న సిరిసిల్ల జిల్లాలో టిఫిన్ బాక్స్ బాంబ్ కలకలం రేపింది. ఛత్తీస్గడ్లో మావోయిస్టుల కాల్పుల ఘటనతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోనరావుపేట మండలం మర్రిమడ్ల శివారులోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా టిఫిన్ బాక్స్ ఫారెస్ట్ అధికారుల కంట పడింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్ స్వ్కాడ్ సాయంతో బాంబును వెలికితీసిన పోలీసులు దాన్ని నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. ఆ ప్రాంతంలో ఇంకా ఏవైనా బాంబులు ఉన్నాయేమోనన్న అనుమానంతో తనిఖీలు చేపట్టారు.
సిరిసిల్ల-నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన మర్రిమడ్ల, మానాల అటవీ ప్రాంతం గతంలో మావోయిస్టులు, జనశక్తి నక్సలైట్లకు మంచి పట్టున్న ప్రాంతం. దీంతో అప్పట్లోనే నక్సలైట్లు ఈ టిఫిన్ బాక్స్ బాంబును ఏర్పాటు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో మరెక్కడా బాంబులు లేవని నిర్ధారణ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో జవాన్లపై మావోయిస్టులు విరుచుకుపడిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు.