ప్రాణహిత నది అవతలి ఒడ్డున మహారాష్ట్ర లోని సిర్వంచ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పులిని వేటాడి దాని చర్మం అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా ఆహేరి తాలుకా మరుపల్లి గ్రామంలో ఒక చిరుత పులి ని చంపి, దాని చర్మం ఒలిచి మంచిర్యాల జిల్లా చెన్నూర్ రూరల్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్స గ్రామంలో చిరుత పులి చర్మం ను ఎవరికైనా అమ్మడం కోసం ముగ్గురు వస్తున్నారని సమాచారం అందుకున్న రామగుండం పోలీసులు కాపు కాశారు.
వారు కోటపల్లి ప్రాంతం కి వస్తున్నరనే సమాచారంపై కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు. గడ్చిరోలికి చెందిన కొండగోర్ల తిరుపతి, సదిమిక్ గంగారాం, వెలది తులసిరాం లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఎండ బెట్టిన చిరుత పులి చర్మం స్వాధీనం చేసుకున్నారు.
రామగుండం పోలీసు కమిషనర్ వి. సత్యనారాయణ ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు, అడిషనల్ డీసీపీ అడ్మిషన్ ఎన్ .అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీ లా & ఆర్డర్ రవి కుమార్, మంచిర్యాల డీసిపి డీ ఉదయ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ సి.ఐలు రాజు కుమార్, కిరణ్, ఎస్సై మస్తాన్ సిబ్బంది తో ప్రత్యేక టీం ఈ ఆపరేషన్ చేసింది.