శ్రీవారి భక్తులకు 2021 టిటిడి డైరీలు, క్యాలెండర్లను మరింత సౌకర్యవంతంగా, వేగంగా అందించేందుకు పోస్టల్ డిపార్టుమెంటుతో పాటు అమెజాన్ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు టిటిడి జెఈవో పి.బసంత్కుమార్ తెలిపారు.
టిటిడి డైరీలు, క్యాలెండర్లకు విశ్వవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. గతంలో పోస్టల్ డిపార్టుమెంట్, వివిధ కొరియర్ ఏజెన్సీల ద్వారా డైరీలు, క్యాలెండర్లు అందించేవారు. భక్తులకు మరింత విస్తృతంగా, వేగంగా టిటిడి డైరీలు, క్యాలెండర్లు అందించేందుకు ప్రముఖ ఆన్లైన్ సంస్థ అయిన అమెజాన్తో సంప్రదింపులు జరుపుతునట్లు తెలియజేశారు.
టిటిడి పరిపాలన భవనంలో గల తమ కార్యాలయంలో ఆయన టిటిడి అధికారులు, అమెజాన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమెజాన్ సంస్థ ప్రతినిధులు అభిలాష్, షీతాల్ కుమార్లు టిటిడి డైరీలు, క్యాలెండర్లను అమెజాన్ ఆన్లైన్ బుకింగ్ ద్వారా అందించేందుకు కార్యాచరణ ప్రణాళికలు త్వరలో తెలియజేస్తామన్నారు.
విదేశాలకు కూడా అమెజాన్ ద్వారా
టిటిడి నిబంధనల మేరకు దశల వారిగా దేశ విదేశాలలోని భక్తులకు టిటిడి డైరీలు క్యాలెండర్లు అందిస్తామన్నారు. ఇందులో భాగంగా మొదట బెంగుళూరు కేంద్రంగా దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చేరవేస్తామన్నారు.
అదేవిధంగా అక్టోబర్ నుండి ఢిల్లీ కేంద్రంగా ఉత్తర భారత దేశంలో అందిస్తామన్నారు. మలిదశలో విదేశాలలోని భక్తులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
టిటిడి ముద్రించిన రూ.100/- విలువగల 12 పేజీల క్యాలెండర్లు, రూ.15/- విలువగల శ్రీవారి పెద్ద క్యాలెండర్లు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు, రూ.10/- విలువగల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు, రూ.20/- విలువగల తెలుగు పంచాంగం క్యాలెండర్లు, రూ.60/- విలువగల టేబుల్ టాప్ క్యాలెండర్లు, రూ.130/- విలువగల పెద్ద డైరీలు, రూ.100/- విలువగల చిన్నడైరీలు భక్తులకు ఆన్లైన్ కూడా అందుబాటులో ఉంచనున్నట్లు జెఈవో తెలిపారు.