లాక్ డౌన్ సమయంలో ఏ ఉద్యోగిని తీసేయద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పినా తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం వినడం లేదు. తిరుమల కొండను అనుక్షణం పరిశుభ్రంగా ఉంచే 1300 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించేశారు. పద్మావతి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసు సంస్థ కింద వీరందరూ ఇన్నాళ్లూ పనిచేశారు.
కొండపైన రోడ్లు ఊడ్చడం, కాటేజీలు శుభ్రం చేయడం, పార్కులు నీట్ గా ఉంచడం వీరి విధి. అలాంటి వారిని తిరుమల తిరుపతి దేవస్థానం ఏకపక్షంగా తీసేసింది. వీరిలో ఒక్కొక్కరు ఎనిమిది సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. మూడున్నర వేలతో ప్రారంభించి వీరి జీతం ఇప్పటికి కొందరికి 8 వేలు, మరి కిందరికి 12వేలకు వచ్చింది.
కొన్ని సంవత్సరాలుగా స్వామి సేవలో ఉన్న వీరు జీతం కన్నా భక్తినే ఎక్కువ పెంచుకుని ఉన్నారు. అలాంటి ఈ సేవకులను తిరుమల తిరుపతి దేవస్థానం సాగనంపింది. పద్మావతి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసు సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగిసిన కారణంగా ఉద్యోగులను తీసేసినట్లు టీటీడీ చెబుతున్నది. కాంట్రాక్టర్ కాలపరిమితి పూర్తి అయితే వేరే కాంట్రాక్టర్ ను పెట్టుకుని ఇదే ఉద్యోగులను కొనసాగించాలి కానీ కాంట్రాక్టు కాలపరిమితి ముగిసిందనే పేరుతో ఉద్యోగులను తీసేస్తే ఎలా? ఇదే ప్రశ్న ఆ కార్మికులు వేస్తున్నారు.