టీటీడీ లో కొంతమంది అధికారులు ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పింక్ డైమండ్ పై తిరుపతి కోర్టులో వేసిన కేసు నుంచి తప్పించుకోవచ్చు నేమో గాని వెంకటేశ్వర స్వామి కోర్టులో ఎవరు తప్పించుకోలేరు శిక్ష తప్పదు అని హెచ్చరిస్తున్నానని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
శ్రీవారి సొమ్ము 2 కోట్ల పరువునష్టం కోర్టు ఫీజు గోడకు కొట్టిన సున్నమేనా అని ఆయన ప్రశ్నించారు. శ్రీ వెంకటేశ్వర స్వామితో,భక్తుల మనోభావాలతో పింక్ డైమండ్ ఉందని కొంతమంది లేదని కొంతమంది దాగుడుమూతలు ఆడినవారిని కోర్టు కేసు ద్వారా శిక్షించాల్సింది పొయి రక్షించే ప్రయత్నం చేయడం మహా అపచారమని ఆయన అన్నారు.
కేసు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు?
భక్తులకు తెలియకుండా భక్తుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం టిటిడి అధికారులు,ధర్మకర్తల మండలి చేయడం మహా పాపం అని ఆయన అన్నారు. టిటిడి అధికారులు 2018 లో పింక్ డైమండ్ విషయమై 200 కోట్ల మేర టీటీడీ కి పరువు నష్టం జరిగిందని అందుకు బాధ్యులైన రమణదీక్షితులు విజయసాయి రెడ్డి లపై కేసు పెట్టారు మరి ఇప్పుడు ఎవరి ప్రోద్బలంతో కేసు ఉపసంహరించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు “శ్రీవారి సన్నిధిలో ప్రమాణం” చేసి భక్తులకు చెప్పండి అని ఆయన డిమాండ్ చేశారు.
టిటిడి ఆగమ సలహా మండలిలో ఉన్న రమణ దీక్షితులు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గార్లు పింక్ డైమండ్ కేసు ఉపసంహరణకు టీటీడీ చేస్తున్న ప్రయత్నాల పై స్పందించాలి ఆనాడు మీరు చెప్పిన విధంగా పింక్ డైమండ్ ఉందా లేదా ఉంటే ఎక్కడ ఉంది అన్న వాస్తవాలు బహిర్గతం చేయాలని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
రమణదీక్షితులు ప్రకటనతో భక్తులు ఆందోళన చెందారు
శ్రీవారి పింక్ డైమండ్ కనబడుట లేదు అని వంశపారపర్యంగా శ్రీవారికి సేవలందిస్తున్న రమణ దీక్షితులు చెప్పడం అది చంద్రబాబు నాయుడు ఇంటిలో ఉంది అని వైసిపి నేత విజయసాయిరెడ్డి బహిరంగంగా ప్రకటించడంతో శ్రీవారి కోట్లాది మంది భక్తులు ఎంతో ఆందోళన చెందారని ఆయన అన్నారు.
నేడు మరి టిటిడి అధికారులు తిరుపతి కోర్టులో పింక్ డైమండ్ కేసు ఉపసంహరణకు అఫిడవిట్ దాఖలు చేసింది వాస్తవమా కాదా శ్రీవారి భక్తులకు సమాధానం చెప్పండి అంటూ ఆయన నిలదీశారు. టీటీడీ వారు కోర్టు ఫీజు కింద కట్టిన 2 కోట్ల రూపాయలకు ఎవరు బాధ్యత వహిస్తారు పింక్ డైమండ్ కేసులో అప్పటి ఇప్పటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం వాదులుగా ప్రతివాదులుగా ఉన్న వారి వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసి తిరిగి శ్రీవారి ఖాతాలో జమ చేసిన తర్వాతే టీటీడీ కేసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.