తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి గురువారం జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి చక్రతీర్థానికి చేరుకున్నారు. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చక్రతీర్థం ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఈ తీర్థానికి అభిషేకం, పుష్ప నివేదన, హారతి సమర్పించారు.
తిరుమలలో నిండిన జలాశయాలు
తిరుమలలో కురుస్తున్న వర్షం కారణంగా 5 జలాశయాలు పూర్తిగా నిండాయి. ఇంజినీరింగ్ అధికారులు పాపవినాశనం, గోగర్భం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. బుధవారం ఉదయం 8 నుండి గురువారం ఉదయం 8 గంటల వరకు నమోదైన వర్షపాతంతో జలాశయాల నీటిమట్టం వివరాలిలా ఉన్నాయి.
పాపవినాశనం డ్యామ్లో 313 మి.మీ వర్షపాతం నమోదు కాగా, నీటిమట్టం 697.14 ఎఫ్ఆర్ఎల్గా(పూర్తి నీటిమట్టం 698.85 ఎఫ్ఆర్ఎల్) ఉంది.
గోగర్భం డ్యామ్లో 247 మి.మీ వర్షపాతం నమోదు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 2894 ఎఫ్ఆర్ఎల్(ఫుల్ రిజర్వాయర్ లెవల్)గా ఉంది.
ఆకాశగంగ డ్యామ్లో 176 మి.మీ వర్షపాతం నమోదు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 865 ఎఫ్ఆర్ఎల్గా ఉంది.
కుమారధార, పసుపుధార డ్యాముల్లో 155 మి.మీ చొప్పున వర్షపాతం నమోదు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 898.24 ఎఫ్ఆర్ఎల్గా ఉంది.
తిరుమలలో జలపాతాల సోయగం
తిరుమలలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో పలు తీర్థాలు, జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. ఎత్తయిన కొండల నుండి జాలువారుతున్న జలపాతాల సోయగం యాత్రికులను కట్టిపడేస్తోంది. మాల్వాడి గుండం, పంచతీర్థాలు, కపిలతీర్థం జలపాతాలు జలసిరితో ఆకట్టుకుంటున్నాయి.