లబ్దిదారులకు తక్షణమే ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు బిజెపి జనసేన ఆధ్వర్యంలో రెండు గంటల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతిలో బిజెపి జనసేన పార్టీ లు నిరసన కార్యక్రమం చేపట్టాయి.
ఈ సందర్భంగా తిరుపతి జనసేనపార్టీ ఇన్ చార్జి కిరణ్ రాయల్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు పేద ప్రజలకు జి ప్లస్ త్రీ భవనాలు కేటాయిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. పేద వారికి ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తరువాత అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారికి మొండి చెయ్యి చూపిస్తున్నదని అన్నారు.
అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం పైగా గడుస్తున్నా ఇళ్ల కేటాయింపు నకు సంబంధించి ప్రభుత్వంలో ఏమాత్రం స్పందన లేదని ఆయన అన్నారు. హామీలిచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం లబ్దిదారులకు వెంటనే గృహాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు అందజేసిందని, ఆ నిధులు కూడా దారి మళ్లించి అవకతవకలు చేశారని ఆయన అన్నారు. తమ డిమాండ్ కు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తున్నామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజారెడ్డి ,ఆకేపాటి సుభాషిని ,కోకిల అమృత ,సాయి దేవ్ యాదవ్ ,మనోజ్ శేష ,సుమన్ ,మహేష్ ,ప్రవీణ్ జనసేన యువ నాయకులు పాల్గొన్నారు.