తిరుపతిలో రోజు రోజుకూ పెరిగిపోతున్న కరోనా రోగుల సంఖ్యతో బాటు ఇప్పుడు సాంకేతిక సమస్య వచ్చిపడింది. కేంద్ర సర్వర్ తో అనుసంధానం కాలేకపోవడంతో తిరుపతి లోని కోవిడ్ సెంటర్ల సమాచారం ఎవరికి చేరడం లేదు. సమాచారం చేరకపోతే పోయింది కానీ కరోనా పరీక్షల డేటా కూడా గల్లంతు అయ్యే ప్రమాదకర పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇప్పటికే డేటా పూర్తిగా గల్లంతు అయింది. దాదాపు రెండు నుంచి మూడు వేల మంది టెస్టు రిపోర్టులు డేటా లాస్ కారణంగా తారు మారు అయినట్లు లేదా గల్లంతు అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఎవరూ మాట్లాడటం లేదు. అధికారుల నుంచి ఆసుపత్రి సిబ్బంది వరకూ పూర్తిగా మౌనం వహించాలని పై నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.
తిరుపతిలోని రుయా ఆసుపత్రి, పద్మావతి మెడికల్ కాలేజి, స్విమ్స్, శ్రీనివాసపురం లోని పాత్ జెన్ ఆసుపత్రులలో మూడు రోజుల నుంచి కరోనా టెస్టులు కూడా నిలిచిపోయాయి. అయితే ఈ విషయం ఎవరికి తెలియకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు కూడా పూర్తిగా మౌనం పాటిస్తున్నారు.
ఎవరికి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కరోనా పరీక్షలు నిలిపివేసిన సిబ్బంది వేరే కారణాలు చెబుతున్నారు. నేడు అతి కష్టంపైన ఒక ప్రయివేటు సంస్థ నుంచి టెస్టు ఫలితాలు స్టోర్ చేసే సాఫ్ట్ వేర్ ను అధికారులు తెప్పించుకున్నారు. దాంతో నేటి నుంచి రుయా ఆసుపత్రి, పద్మావతి మెడికల్ కాలేజీ, స్విమ్స్ లో కరోనా టెస్టులు ప్రారంభం అయ్యాయి. అయితే ప్రయివేటు ఆసుపత్రి లో నేటి నుంచి టెస్టులు అనధికారికంగా నిలిపివేసినట్లు చెబుతున్నారు.