నెఫ్రోప్లస్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా కిడ్నీ బాధితుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. నెఫ్రో ప్లస్ సంస్థ నిర్వాకాన్ని “మానవ హక్కుల కమిషన్” దృష్టికి తీసుకెళ్తామని, కిడ్నీ బాధితుల మరణాలపై వాస్తవాలు వెలుగులోకి రావాలని ఆయన అన్నారు.
నెఫ్రోప్లస్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా టీటీడీ, స్విమ్స్ ప్రతిష్ట దిగజారుతుందని, స్విమ్స్ లో కిడ్నీ బాధితుల కోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కిడ్నీ బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నెఫ్రోప్లస్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, కిడ్నీ బాధితుల కోసం అనుభవం కలిగిన వైద్యుల ద్వారా డయాలసిస్ చేయించి వారికి పౌష్టిక ఆహారంతో పాటు డయాలసిస్ కు వచ్చినప్పుడు సహాయకులను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
కిడ్నీ బాధితులు సుమారు 800 మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దినదినగండంగా డయాలసిస్ చేసుకునే దౌర్భాగ్యపు స్థితి నుంచి కాపాడవలసిన బాధ్యత టీటీడీ పై ఉందని ఆయన అన్నారు.