3,4,5 తరగతుల విలీనం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేల పాఠశాలలను విలీనం చేసి ప్రభుత్వ విద్యను పేదలకు అందకుండా చేసే జీవో నెంబర్ 117 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించింది. జీవో 117 కాపీని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పతివాడ తారక రామానాయుడు మాట్లాడుతూ జీవో నెంబరు 117 గ్రామాలలో బాలికల విద్య కు శాపంగా మారిందని అన్నారు. దీనితో జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని 70 సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్లారని, విద్యార్థులకు మేనమామ గా ఉంటానని కంస మామ గా మారారని ఆయన అన్నారు. బాలికల విద్యకు జగన్ రెడ్డి కంటకుడు గా మారి, గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్యను అందని ద్రాక్షగా చేస్తున్నారని అన్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచే తల్లిదండ్రులు మా గ్రామంలో పాఠశాలలు మాకే ఉంచాలి ‘మా పాఠశాల – మా హక్కు’ అనే నినాదంతో, రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న పాఠశాలల విలీన ప్రక్రియ ను వెనక్కు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తూ ఉన్నదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాలలను విలీనము చేయవలసిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ కూడా పేద విద్యార్థులు విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాలల పై ఉక్కుపాదంతో జీవో నెంబర్ 117 తీసుకొని వచ్చి రేషనలైజేషన్ పేరిట విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించి, స్టూడెంట్ టీచర్ రేషియో తో సంబంధం లేకుండా చేస్తున్నారని అన్నారు.
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అకారణంగా ఉపాధ్యాయ పోస్టులను తగ్గించే విధంగా, భవిష్యత్తులో పది సంవత్సరాల వరకు డీఎస్సీ అవసరమేరానట్లుగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆయన అన్నారు. దీనిపై విద్యావేత్తలు విద్యార్థులు మేధావులు అందరూ స్పందించి పాఠశాలల విలీన ప్రక్రియపై పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు రామానాయుడు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు బెవర భరత్, కొత్తకోట బాలకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పీకేఎల్ రాజు, బంటుపిల్లి కిరణ్, అధికార ప్రతినిధి సుంకర అనంత్, అసెంబ్లీ అధ్యక్షులు మైలపల్లి వాసు, జమ్ము నారాయణరావు, కోరాడ రామకృష్ణ, శ్రీనివాసరావు శ్రీనివాస్ రావు, ఎన్ని వాసు, మధుసూదన్ రావు, మహంతి రామానాయుడు, తోట శేఖర్ రాధాకృష్ణ, కిలాని వెంకటేష్, విజయ్ కుమార్, సుంకరి భరత్ కొండ్రు సాయి సభ్యులు పాల్గొన్నారు.