35.2 C
Hyderabad
April 20, 2024 17: 15 PM
Slider ప్రత్యేకం

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

#TeluguLanguage

(మా శర్మ, సీనియర్ జర్నలిస్టు)

ప్రతి ఏటా దీన్ని పండుగలా జరుపుకోవాలని యునెస్కో 1999 నవంబర్ 17వ తేదీ నాడు ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి  ప్రపంచ దేశాలన్నీ తల్లిభాషను తలపుల్లో నిలుపుకుంటూ తరిస్తున్నాయి. ఈ వేడుక మొదలై ఇప్పటికి రెండు దశాబ్దాలు దాటిపోయింది.

“కాకి పిల్ల కాకికి ముద్దు” అన్న చందాన, ఎవరి భాష వారికి ఇష్టమే. మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషను నిత్యం కొలిచే సంప్రదాయం మన సంస్కృతిలోనే ఉంది. కాల ప్రవాహంలో, జీవన గతిలో చాలామంది ఈ మూడింటికీ దూరమవుతున్నారు.

పరాయి భూముల్లో పరిఢవిల్లుతున్న తెలుగు

కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ.. ముగ్గురు అమ్మలూ ఏడ్చే పరిస్థితులే కాన వస్తున్నాయి. తెలుగు భాషా సంస్కృతులు పరాయిభూముల్లోనే పరిఢ విల్లుతున్నాయి. ఉద్యోగ ఉపాధి కోసం విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు నిత్యం తెలుగుతల్లిని గుండెల్లో నిలుపుకునేలా కార్యక్రమాలు చేపడుతూ ఉండడం అభినందనీయం.

ఎంత ఎంత ఎడమైతే… అంత తీపి కలయిక అన్నట్లుగా, ఏదో ఒక రూపంలో తల్లి భాషకు దగ్గరయ్యే కృషి విదేశాల్లో ఉన్న తెలుగువారు చేస్తున్నారు. కవులను, కళాకారులను ఇక్కడ నుంచీ అక్కడకు పిలుపించుకుని మన పద్యాలు, అవధానాలు, వాగ్గేయకార కీర్తనలు, కూచిపూడి నృత్యాలు, భువన విజయరూపకాలకు పట్టం కడుతున్నారు.

ఇది హర్షదాయకం. కొన్ని దశాబ్దాల నుంచి తల్లిపాలకు, తల్లిభాషకు చాలా వరకూ దూరమవుతున్నాం.తల్లిపాలు ఇచ్చే ఆరోగ్యం, తల్లి భాష ఇచ్చేఆనందంలో అవధులే ఉండవు. క్రమంగా ఈ రెండిటికీ దూరమవుతూ ఉండడమే విషాదం.

బ్రౌన్ దొరను ఆకట్టుకున్న వేమన పద్యం

మన దేశాన్ని దోచేద్దామని వచ్చిన బ్రౌన్ దొర గుండెను సైతం మన పద్యం దోచేసింది. దొరగారు వేమన్న వెర్రిలో పడిపోయాడు. తమిళవారు మహాకవిగా భావించే సుబ్రహ్మణ్యభారతికి తెలుగువంటి తీయనైన భాష ఇంకొకటి లేనేలేదని అనిపించింది. శ్రీకృష్ణదేవరాయల పితృభాష తుళు.

కానీ మాతృభాష తెలుగేనని చరిత్రకారులు చెబుతున్నారు. “దేశ భాషలందు తెలుగు లెస్స ” అని శ్రీకృష్ణదేవరాయలు పలికినా, వినుకొండ వల్లభరాయడు చెప్పినా, అవి అక్షర సత్యాలు. దేశ భాషల్లో ‘అచ్చు’తో అంతమయ్యే అజంత భాష తెలుగు.

తెలుగు అమృత భాష

తెలుగు మాట్లాడుతూ ఉంటే సంగీత మెదియో వింటున్నట్లు ఉండే అమృత భాష తెలుగు, అని ఎందరెందరో కీర్తించారు. అంతర్జాతీయ భాషా దినోత్సవం నాడు మిగిలిన భాషలను గౌరవిస్తూనే, మన భాషను పూజించుకోవాలి. అన్ని భాషలు విలసిల్లాలి. అన్ని సంస్కృతులు విరాజిల్లాలి.

సర్వమత సహనం వలె, సర్వ భాషల పట్ల ప్రియంగా ఉండమని యునెస్కో చెబుతోంది. ఈ సందర్భంగా, భాషల స్థానాన్ని విశ్లేషించుకుందాం. ప్రపంచంలోనే ఎక్కువమంది మాట్లాడే భాషల్లో నాల్గవ స్థానం హిందీకి, ఆరవ స్థానం బెంగాలీకి,10వ స్థానం లహందీకి (పశ్చిమ పంజాబీ)దక్కాయి.

ఈ పదింటిలో మూడు భారతీయ భాషలు ఉండడం విశేషం.ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న భాషల్లో ఇంగ్లీష్ దే అగ్రపీఠం. మాతృభాషతో పాటు తప్పకుండా నేర్చుకోవాల్సిన భాష ఇంగ్లిష్. వీటికి తోడు అదనంగా నేర్చుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్న భాషల్లో చైనీస్, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్, అరబిక్, రష్యన్, పోర్చుగీస్, జపనీస్, హిందీ, ఇటాలియన్ కొరియా ప్రధానమైనవి.

దేశ భాషల్లో నాలుగో స్థానంలో తెలుగు

భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో హిందీ మొదటి స్థానంలో ఉంది. సుమారు 50కోట్ల మంది ఈ భాషను మాట్లాడేభాషగా ఉపయోగిస్తున్నారు. రెండవ స్థానం బెంగాలీకి, మూడవ స్థానం మరాఠీకి, నాల్గవస్థానం తెలుగుకు ఉన్నాయి. కేవలం జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ క్రమంలో విభజించారు. “జనని సంస్కృతంబు సకల భాషలకు ” అంటారు. మన జ్ఞానం మొత్తం ఇందులోనే దాగి వుంది.

మనం మాట్లాడే చాలా మాటలు సంస్కృతం నుంచి పుట్టినవే.ఇంతటి సంస్కృత భాషకు మనం దూరమై చాలా కాలమైంది.బ్రిటిష్ వాళ్లు మన విద్యా విధానాన్ని పాడు చేసిన క్రమంలో, సంస్కృతం మనకు దూరమైపోయింది. సంస్కృతాన్ని అభ్యసించడం, పరిరక్షించుకోవడం అత్యంత కీలకం.

దేశంలో ఎన్ని భాషలు ఏర్పడినా, సంస్కృతంలో అవలీలగా, అలవోకగా ఒదిగిన భాషల్లో తెలుగుదే అగ్రతాంబూలం.సంగీత, సాహిత్యాలకు జీవంపోసే రసపుష్టి తెలుగులో ఉన్నంతగా మిగిలిన భాషలకు లేదు.ఉర్దూ కూడా గొప్ప భాష. ఈ భాషలో రాజసం ఉంటుంది.

మొన్న మొన్నటి వరకూ సంస్థానాలలో, రాజాస్థానాలలో సంగీత, సాహిత్యాలలో రాజ్యమేలిన భాష ఉర్దూ. ఇది భారతీయమైన భాష. ఇండో-ఆర్యన్ వర్గానికి చెందిన భాషగా దీనికి గుర్తింపు వుంది. ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో ఉర్దూ 11వ స్థానంలో ఉంది.

మన తల్లి భాషకు మరింత గౌరవం దక్కాలి

భారతీయ భాషలకు దక్కుతున్న ఈ గౌరవాలను చూసి, ఆనందిస్తూనే, మన తల్లిభాష తెలుగు గురించి మరింత ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. అత్యంత ప్రాచీన భాషలలోను మనకు హోదా దక్కింది. దీన్ని సాధించుకోడానికి రాజకీయంగా పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చింది.

మనతోటి దక్షిణాది భాషల్లో కన్నడ లిపికి, మన లిపికి ఎంతో సారూప్యతలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ రెండూ కలిసే ఉన్నాయి. మన కంటే కాస్త ముందుగా తమిళం సొంత పదాలు సృష్టించుకొని, స్వాతంత్య్రం పొందింది. మన జాను తెనుగు, అచ్చ తెనుగు వికసించినా, సంస్కృత భాషా సంపర్కం మన భాషకు వన్నెలద్దుతూనే ఉంది.

విద్యా బోధనలో, ఉద్యోగఉపాధిలో తెలుగును వెనక్కు నెట్టేస్తున్నారన్నది చేదు నిజం. అభివృద్ధి కోసం ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఏ భాషలు ఎంత అవసరమైనా, తెలుగును విస్మరించకుండా ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఇంగ్లీష్ భాషలో బోధన అవసరమే అయినప్పటికీ, కనీసం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ తెలుగులో బోధన ఉండడం ముఖ్యం.

తెలుగు మాధ్యమం ఉండాల్సిందే

ఒక సబ్జెక్టుగా తెలుగును తప్పనిసరిగా ఉంచడం కంటే, ఇంగ్లీష్ లేదా తెలుగులో విద్యాభ్యాసం చేసే సదుపాయం ఉంచడం అత్యంత కీలకమని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలను గౌరవించడం ప్రభుత్వాల బాధ్యత. ఏ భాషలోనైనా చదువుకునే వెసులుబాటు కల్పించడమే వివేకం.

మనో వికాసానికి, మేధో వైభవానికి తల్లిభాష తల్లిపాల వంటిది. అది అందరూ గుర్తించి తీరాలి. పట్టుదల, అవసరం, తెలివి, కృషి ఉంటే ఎన్ని భాషలనైనా,ఎప్పుడైనా నేర్చుకోవచ్చునని మన పూర్వులెందరో చేసి చూపించినవే.వివిధ స్థాయిల్లోని తెలుగు పాఠ్యాంశాలలో పద్యం దూరమవుతోంది.

వ్యాకరణం, ఛందస్సు దూరమవుతున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. ఆధునిక సాహిత్య ప్రక్రియలకు స్థానం కలిపిస్తూనే,సంప్రదాయ పద్యాన్ని సమున్నతంగా గౌరవించేలా పాఠ్యాంశాలు ఉండాలి. పద్యం మన తెలుగువాడి సొత్తు.వ్యాకరణం లేకపోతే, పునాదిలేని భవనంలా భాషల మూలాలు దెబ్బతింటాయి.

నిన్నటి వరకూ మైసూర్ లో ఉన్న తెలుగు కేంద్రం మన నెల్లూరుకు తరలి రావడం మంచి పరిణామమే. ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనూ, కేంద్రం నుంచి తెలుగు భాషా వికాసాల కోసం నిధులను తెప్పించుకోవడంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి.

తెలుగు చదువుకున్న వారికి ప్రాధాన్యతనివ్వాలి

తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిపై అన్ని విశ్వవిద్యాలయాలలోనూ పరిశోధనలు పెరగాలి. తెలుగు చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాధిల్లో విశిష్ట స్థానం కలిపించాలి. ఈ బాధ్యత ప్రభుత్వాలదే. భాషలు జీవ నదుల వంటివి. అనేక అన్యభాషలను కలుపుకుంటూనే ప్రవహిస్తూ ఉంటాయి.

కాకపోతే మురికినీరు చేరకుండా, చేరినా, చెడు జరుగకుండా చూసుకోవడం మన పనే. మాండలీకాలకు ఉండే సొగసు సోయగం వేరు.వాటిని గేలి చేయకుండా, ఆ పరిమళాలను ఆస్వాదిద్దాం. తల్లి తెలుగు భాషను నెత్తిపై పెట్టి పూజించుకుంటూ, ఆ వెలుగులో, ఆ వెలుతురులో రసమయంగా జీవిద్దాం. జై తెలుగు తల్లి.

(మాతృ భాషాదినోత్సవం సందర్భంగా సత్యం న్యూస్ ప్రత్యేకం)

Related posts

గిరగిరా తిరుగుతున్నదొనకొండ భూములు

Satyam NEWS

హన్మకొండ బాలసముద్రం బాలికల హాస్టల్ లో ఉచిత వైద్య శిబిరం

Satyam NEWS

హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ 2023 జెర్సీ విడుదల

Satyam NEWS

Leave a Comment