ఇద్దరూ మహిళా ఎమ్మెల్యేలే. అయితే ఎంత తేడా? ఒకామె రాళ్లపై నడిచివెళుతూ బరువులు మోస్తూ లాక్ డౌన్ బాధితులకు ఆహారం తీసుకుని వెళుతూ ఉన్నది. మరొకామె ప్రజలను నడి ఎండలో నిలబెట్టి వారి చేతుల్లో పూలు పెట్టి తాను నడుస్తుంటే వారితో తన కాళ్ల వద్ద పూలు చల్లించుకుంటున్నది.
పూల మీద నడుస్తున్న ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్ కె రోజా కాగా రాళ్లపై నడుస్తూ ఆకలితో ఉన్న అడవి బిడ్డలకు అన్నం తీసుకువెళుతున్న తెలంగాణ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క. లాక్ డౌన్ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి అధికార పార్టీ ఎమ్మెల్యే రోజా ఒక బోరు ప్రారంభోత్సవానికి వెళ్లే సమయంలో పూలాభిషేకం చేయించుకున్నారు.
నగరి మునిసిపాలిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లల్ని కూడా ఆమె తీసుకువచ్చి రోడ్లపై నిలబెట్టి తన కాళ్లపై పూలు చల్లించుకున్నారు. లాక్ డౌన్ సందర్భంగా ఇళ్లలో ఉండాల్సిన మహిళలు, పిల్లలు రోజా కారణంగా రోడ్డుపైకి వచ్చారు. భౌతిక దూరం పాటించడం లేదు. కరోనా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? రోజానా?
ఆదివాసి అడవి బిడ్డల ఆకలి తీర్చడం కోసం తన ఆకలి సైతం మరచిపోయి అడవి బాట పట్టిన ఎమ్మెల్యే సీతక్క. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు లాక్ డౌన్ విధించిన అప్పటి నుంచి కూడా అడవి బిడ్డల ఆలనాపాలనా చూస్తూ అండదండగా ఉంటూ అమ్మగా,అక్కగా ఆశ్రయం ఇస్తుంటే ఎమ్మెల్యే అంటే ఇలానే ఉండాలి ఎమ్మెల్యే అంటే ఇలా చేయాలి ఎమ్మెల్యే అంటే ఇలా ఒకరికి ఆదర్శం కావాలి అనేలా మరిచిపోలేని విధంగా ప్రజలకు ప్రజా సేవ చేస్తుంది.
అక్కడ ఆదివాసి బిడ్డలంతా ఈ సీతని ఎమ్మెల్యేగా గెలిపించు కోకుండా ఉండుంటే ఆకలి కేకలతో ఇప్పటికే సగం చచ్చి ఉండేవాళ్ళం అనేంతత నమ్మకం ఇచ్చింది. మేము ఎన్నో వందల మంది నాయకులను,ప్రజా ప్రతినిధులను చూశాం ఎవరికి ఎలాంటి న్యాయం జరగలేదు. కానీ సీతక్క లాంటి ఎమ్మెల్యేను జీవితంలో చూడలేదు అనేది నమ్మకం ఏర్పడింది అంటున్నారు గిరిజనులు, పేద ప్రజలు.