27.7 C
Hyderabad
April 18, 2024 09: 17 AM
Slider తెలంగాణ

నేటి నుంచే రైతు బంధు 61.49 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం

Raithu Bhandhu

28 నుంచి నేటి నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్ల రూపాయలు పంటసాయంగా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు – కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్నిఅందించడం తదితర అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది.

ఈ సమావేశంలో మంత్రులు కేటీ రామారావు, ఎస్.నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, జనార్దన్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఏడీఏ విజయ్ కుమార్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల పంటల కొనుగోళ్ల వల్ల చాలా నష్టం జరిగినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. వరి ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, శనిగలు, పొద్దు తిరుగుడు పువ్వు, మినుములు తదితర పంటల కొనుగోళ్ల వల్ల ఇప్పటివరకు దాదాపు రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చిందని అధికారులు చెప్పారు. రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు చేసినప్పటికీ ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల ప్రభుత్వం తక్కువ ధరకు అమ్మాల్సి వస్తున్నది. దీనివల్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి తలెత్తుతున్నదని వారు అభిప్రాయ పడ్డారు. కేవలం ధాన్యం కొనుగోళ్ల వల్లనే రూ.3,935 కోట్ల నష్టం వచ్చిందని వివరించారు. మక్కల కొనుగోళ్ల వల్ల రూ.1547.59 కోట్లు, జొన్నల వల్ల రూ.52.78 కోట్లు, కందుల వల్ల రూ.413.48 కోట్లు, ఎర్రజొన్నల వల్ల రూ.52.47 కోట్లు, మినుముల వల్ల రూ.9.23 కోట్లు, శనిగల వల్ల రూ.108.07 కోట్లు, పొద్దుతిరుగుడు కొనుగోళ్ల వల్ల రూ.14.25 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు వివరించారు. ఇలా నికరంగా వచ్చిన నష్టంతోపాటు హమాలీ, ఇతర నిర్వహణా ఖర్చులన్నీ కలుపుకుంటే రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు అధికారులు చెప్పారు.

‘‘ ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే మానవతా దృక్పథంతో ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసింది. ప్రతిసారి అలాగే చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. రైస్ మిల్లరో, దాల్ మిల్లరో కాదు. కొనుగోళ్లు – అమ్మకాలు ప్రభుత్వం బాధ్యత కాదు. కాబట్టి వచ్చే ఏడాది నుండి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదు. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. కాబట్టి ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. అయితే, వ్యవసాయ మార్కెట్లలో అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా, పద్ధతి ప్రకారం నిర్వహించాలి. రైతులంతా ఒకేసారి తమ పంటను మార్కెట్ కు తీసుకురాకుండా వంతుల ప్రకారం తీసుకురావాలి. రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, వ్యవసాయ విస్తరణాధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏ గ్రామానికి చెందిన రైతులు ఎప్పుడు మార్కెట్ కు సరుకులు తీసుకు రావాలో నిర్ణయించాలి. దాని ప్రకారం రైతులకు టోకెన్లు ఇవ్వాలి. చెప్పిన రోజు మాత్రమే సరుకును మార్కెట్ కు తీసుకరావడం వల్ల రైతులకు సౌలభ్యంగా ఉంటుంది. ఈ పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలి ’’ అని సమావేశంలో పాల్గొన్న వారంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘ తెలంగాణలో వ్యవసాయం బాగా విస్తరిస్తున్నది. వ్యవసాయశాఖ అనేక పనులు నిర్వహించాల్సి వస్తున్నది. వ్యవసాయ అధికారులపై ఇతర బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. రైతులకు ప్రతిఏటా రెండుసార్లు రైతుబంధు పంటసాయం అందించే పనులను వ్యవసాయ అధికారులు చూడాలి. రైతు బీమాను పకడ్బందీగా అమలు చేయాలి. రైతు బీమా కార్యక్రమం ప్రారంభించిన నాడు కేవలం రూ.630 కోట్ల కిస్తీ మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. కానీ, చాలామంది రైతులు తమ కుటుంబ సభ్యులందరికీ బీమా వర్తింపజేయాలనే ఉద్దేశంతో తమకున్న భూమిని కుటుంబ సభ్యుల పేర రిజిస్టర్ చేయించారు. దీంతో రైతుల సంఖ్య పెరిగింది. ప్రీమియం దాదాపు రెట్టింపైంది. కిస్తీ ఏడాదికి రూ.1,144 కోట్లు కట్టాల్సి వస్తున్నది. అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనే నిర్ణయించుకుంది. వ్యవసాయ అధికారులే రైతుబీమా పథకం అమలును పర్యవేక్షించాల్సి ఉంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి. సకాలంలో నాణ్యమైన, కల్తీలేని విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందేట్లు చూడాలి. కల్తీలను, నకిలీలను గుర్తించి అరికట్టాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మరిన్ని పరిశోధనలు జరగాలి. కొత్త వంగడాలను సృష్టించాలి. వ్యవసాయదారులకు ఆధునిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలి. వ్యవసాయ విస్తరణ పనులు చేయాల్సి ఉంది. తెలంగాణలో సాగునీటి వసతి పెరిగినందున వ్యవసాయం కూడా బాగా పెరిగింది. వ్యవసాయశాఖ చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఆ పనులను చిత్తశుద్ధితో పర్యవేక్షించాలి ’’ అని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.

‘‘రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతున్నది. ఈ రైతువేదికల్లో రైతులు, వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశం కావాలి. తమ స్థానిక పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేయాలనే విషయంలో అక్కడే నిర్ణయాలు తీసుకోవాలి. మద్దతు ధర వచ్చేందుకు అనువైన వ్యూహం ఎక్కడికక్కడ రూపొందించుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ రైతు ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదు. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలి. పంటను ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే అమ్ముకోవాలి. ఈ విధానం ఉత్తమం’’ అని సమావేశంలో విస్తృత అభిప్రాయం వ్యక్తమైంది.

Related posts

శ్రీశైలంలో భక్తులను అలరించిన తోలుబొమ్మలాట

Satyam NEWS

ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

లారీ ఢీకొని యువకుడి మృతి మరొకరికి గాయాలు

Satyam NEWS

Leave a Comment