తొలి ఏకాదశి పర్వదినాన భక్తులతో కళకళలాడాల్సిన ఆలయాలు కరోనా ప్రభావంతో వెలవెల బోయాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్ళచెరువు మండల కేంద్రంలోని శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.
శ్రీ ఇష్ట కామేశ్వరి అమ్మవారికి పంచామృతాభిషేకం కుంకుమార్చన వైభవంగా అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారికి వైదిక సంప్రదాయంగా శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కరోనా ప్రభావం వల్ల భక్తులకు దర్శనాలు అనుమతి లేకపోవడంతో, అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ, కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, దేవస్థానం సిబ్బందితో నిర్వహించారు.