రెండు తెలుగురాష్ట్రాల్లో టమాటా ధర రూ.100 దాటింది. పేద, మధ్యతరగతి ప్రజలకు టమాటా దూరమవుతోంది. టమాటా కూర, టమాటా పప్పును పేద ప్రజలు వండడం మానేశారు. కూరల్లో టమాటాకు బదులు చింతపండు వాడుతున్నారు. ఏపీలో భారీ వర్షాలు కురవడంతో టమాటా ధరలు పెరిగాయి. టమాటా పంటలు నీట మునిగాయి. టమాటా సాగుపై వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో దిగుబడి గణనీయంగా పడిపోయింది. చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కిలో టమాటా ఏకంగా 130 రూపాయలు పలికింది. గత నెలలో గరిష్టంగా కిలో 50 రూపాయలు పలికిన టమాటా ధర ఇప్పుడు ఏకంగా 130 రూపాయలకు చేరి ఇంకా ఆకాశంవైపే చూస్తోంది.