జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్లు మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తమ పార్టీ మేనిఫెస్టోను త్వరలో విడుదలకు ఏర్పాటు చేస్తోంది. కాగా నేడు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ భాగ్యనగరానికి రానున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చిన వెంటనే ఆమె ఉదయం 11గంలకు బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమవుతారు.
కాగా రేపు బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేయనున్నట్లు సమాచారం. బీజేపీ మేనిఫెస్టో విడుదల నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవిస్ విడుదల చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గౌతమ్ గంభీర్, కుష్బూ అమిత్ షా, నడ్డా, యోగి ఆదిత్యానాథ్లను ప్రచారానికి తెలంగాణ బీజేపీ నాయకులు ఆహ్వానించారు.
ఓ వైపు మేనిఫెస్టో విడుదల మరోవైపు కేంద్రం నుంచి తెలంగాణలో ప్రచారానికి హేమాహేమీలు రానుండడంతో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుతుందనే చెప్పొచ్చు.
ఇప్పటికే ఆయా పార్టీల నేతల మాటల తూటాలు ఓటర్లపై ఏ విధమైన ప్రభావాన్ని చూపాయో.. ఇకముందు అధికార, ప్రతిపక్ష పార్టీల హేమాహేమీల మాటలు ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో ఎన్నికల ఫలితాల తరువాతనే వెల్లడి కానుంది.