తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటే అవకాశం కనిపిస్తున్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో 20 సెం.మీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
మరో రెండు రోజుల పాటు జీహెచ్ఎంసీలో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే అవకాశం ఉందని.. అదే విధంగా భారీ వర్షాలకు రిజర్వాయర్లు ప్రమాద స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రజలు అవసరం లేకుండా రోడ్లపైకి రావద్దు
ప్రజలెవరూ అనవసరంగా బయటికి రావద్దని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. 24 గంటలు అందుబాటులో ఉండాలని ఇప్పటికే డీజీపీ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించాలని స్టేషన్ ఎస్హెచ్వోలకు ఆదేశాలు అందాయి. ఏ చిన్న ఆపద వచ్చినా వెంటనే ‘100’కు డయిల్ చేయాలని ప్రజలను డీజీపీ కోరారు.
మరో రెండు రోజులపాటు జీహెచ్ఎంసీలో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని జీహెచ్ఎంపీ ఓ ప్రకటనలో తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అనవసరంగా ప్రజలెవరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ డిజాస్టర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ సూచించారు.
ఎంతటి విపత్తు వచ్చిన ఎదుర్కోవడానికి జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉందన్నారు. 90కి పైగా మాన్సూన్, డిజాస్టర్ బృందాలను అందుబాటులో ఉన్నాయని.. పురాతన ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించి, కూల్చివేతలు చేస్తున్నామన్నారు.