ఇకపై కోటగిరి మండల కేంద్రంలో ప్రతీ ఏటా పీ యస్ ఆర్ క్రికెట్ టోర్నీకొనసాగుతుందని బాన్సువాడ నియోజకవర్గ టీఆరెస్ పార్టీ ఇంచార్జి పోచారం సురేందర్ రెడ్డి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని పీ యస్ ఆర్ క్రికెట్ గ్రౌండ్ లో గత నెలరోజులుగా నిర్వహిస్తున్నపీయస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మంగళవారం ఆసక్తి కరంగా జరిగింది.
ఈ మ్యాచ్ లో కోటగిరికి చెందిన అమన్ యూత్ టీమ్ విజేతగా నిలిచింది. ఫైనల్ లో గెలిచిన టీమ్ కు ఫస్ట్ ప్రైజ్ 50,000, ఓడిన నిజామాబాద్ టీమ్ కు 25 వేల ప్రైజ్ మనీని పోచారం సురేందర్ రెడ్డి అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటగిరిలో క్రీడాకారులకు కోదవే లేదని, అందుకే చక్కటి క్రీడా ప్రతిభతో ఫైనల్ వరకు వచ్చి ఫైనల్లో గెలిచారన్నారు. కోటగిరి మండలంలోని క్రీడాకారుల కళను వెలికి తెచ్చేందుకోసమే కోటగిరి మండలకేంద్రంలోని ఖాళీ స్థలాన్ని పీయస్ఆర్ గ్రౌండ్ గా ఏర్పాటు చేసుకున్నామన్నారు. స్పీకర్ పోచారం దృష్టికి తీసుకెళ్లి కోటగిరిలో త్వరలో మినీ స్టేడియం కట్టిస్తామని హామీ ఇచ్చారు. టోర్నమెంట్ విజయవంతం అయ్యేందుకు సహకరించిన అమన్ యూత్ సభ్యులకు కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్ పటేల్, ఏఎంసీ చైర్మన్ గంగధర్, స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, కోటగిరి సొసైటీ చైర్మన్ సిద్దు, మండల పార్టీ అధ్యక్షుడు ఎజాస్ ఖాన్, అనిల్ కులకర్ణి, బర్ల మధు, అర్షద్ తదితరులు పాల్గొన్నారు.