కరోనా బారిన పడిన అనంతపురం జిల్లా సీఐ రాజశేఖర్ మృతి చెందారు. నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల కొవిడ్ బారిన పడ్డారు. నగర శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్లో చికిత్స పొందుతూ ఈ రోజు ప్రాణాలు కోల్పోయారు. ఆయన గుత్తి పట్టణంలో ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తించారు.
అనంతరం పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో సమర్థవంతంగా సేవలు అందించారు. సీఐ రాజశేఖర్ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో తన సమకాలీకుడు అని, ఎంతో సమర్థవంతమైన అధికారి అని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.