రేపు మాఘ పౌర్ణమి సందర్భంగా కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం లోని హంసలదీవి వద్దకు సముద్ర స్నానానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు. అదే విధంగా సముద్రం వరకూ కరకట్ట బలహీనంగా ఉన్నందున పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాలకాయతిప్ప నుంచి సముద్రం వద్దకు వెళ్లే దారిలో వన్ వే లో మాత్రమే ట్రాఫిక్ అనుమతిస్తారు.
సముద్రం వద్దకు వెళ్లే వాహనాలను ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మాత్రమే వదులుతారు. భారీ వాహనాలకు అనుమతి లేదు. సాగర సంగమం వద్ద కృష్ణా నది సుమారు 30 అడుగుల లోతు కోసుకు పోవడంతో భక్తుల భద్రత దృష్ట్యా భక్తులు ఎవరికీ సంగమం వద్దకు వెళ్లేందుకు అనుమతులు లేవు. సముద్రం కోతకు గురైన కారణంగా అధికారులు సూచించిన ప్రాంతంలోనే భక్తులు స్నానాలు చేయాలి.
శ్రీ వేణుగోపాలస్వామివారి కల్యాణోత్సవం లో పాల్గొనే భక్తులు మాస్కు ధరించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కళ్యాణం తిలకించవలసిందిగా పోలీసులు కోరారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు వారి వెంట తెచ్చుకునే బంధువులను, స్నేహితులను, వారి పిల్లలను, వారి సామాన్లను జాగ్రత్తగా చూసుకుంటూ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళ వలసిందిగా అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.బి.రవి కుమార్ కోరారు.
మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని హంసలదీవి సాగర తీరంవద్ద రేపు జరుగబోవు సింధూ స్నానాల ఏర్పాట్లను ఆర్డిఓ ఖాజావలి, తహసీల్దార్ షేక్ లతీఫ్ పాషా, కోడూరు ఎస్ ఐ నాగరాజు, జిల్లా రైతు విభాగం కార్యదర్శి కొండవీటి వెంకట నారాయణ వివిధ శాఖల అధికారులు పరిశీలించారు.