ఎంత ట్రాజెడీ అంటే అయినవాడు మరణించినట్లు తెలిసినా అక్కడకు వెళ్లలేరు. మృతదేహం అయినా చూద్దామంటే లాక్ డౌన్. ఇదీ భూమన్న అనే వ్యక్తి కుటుంబం ట్రాజెడీ స్టోరీ ఇది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన నూతుపల్లి భూమన్న (37) అనే వ్యక్తి గల్ఫ్ దేశంలో మృతి చెందాడు.
సిద్దాపూర్ కు చెందిన మృతుడు భూమన్న గత ఏడాది క్రితం బతుకుదెరువు కోసం బెహరిన్ వెళ్ళాడు. అక్కడ ఓ కంపెనీలో లేబర్ పని చేస్తుండేవాడని కుటుంబీకులు తెలిపారు. కాగా వారం రోజుల క్రితం తన నివాసపు గదిలోని బాత్రూం కు వెళ్ళిన సమయంలో గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ విషయంను గదిలోని తోటివారు వెంటనే సిద్దాపూర్ లోని కుటుంబ సభ్యులకు సమాచారం ఫోన్ లో సమాచారం అందించారు. ఈవిషయం తెలిసిన రోజు నుండి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. మృతునికి భార్య, ఓ కొడుకు ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా విమానాల రాకపోకలు నిలచి పోయి ఉండడంతో భూమన్న మృతదేహం బెహరిన్ లోనే ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతనే శవం స్వదేశానికి పంపించనున్నట్లు తెలిసింది.