ఏపీ ప్రెస్ అకాడమీ జర్నలిస్టుల కు ఆన్ లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా జర్నలిస్టుల శిక్షణా తరగతులు… వెబ్ ద్వారా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ని జర్నలిస్ట్ అందరూ వర్చువల్ లో పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల వృత్తి నైపుణ్యతను మెరుగు పరిచే ప్రక్రియలో భాగంగా సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ జిల్లాల వారీగా వరుస శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. విజయ నగరం జిల్లా జర్నలిస్టులకు వర్చువల్ ఆన్ లైన్ విధానంలో శిక్షణ తరగతులను నిర్వహించారు.
ఈ ప్రారంభోత్సవ ఉపన్యాస కార్యక్రమంలో ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ ప్రారంభ ఉపన్యాసం చేసారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్లాల్, ప్రభుత్వ సలహాదారులు దేవులపల్లి అమర్ లు పాల్గొని సమాజంలో జర్నలిస్టుల ప్రాధాన్యత, వారి వృత్తి నిబధ్ధతపై ప్రసంగించారు.
ఏపీ ప్రెస్ అకాడమీ కార్యదర్శి మామిడిపల్లి బాలగంగాధర తిలక్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆన్ లైన్ శిక్షణలో భాగంగా సీనియర్ పాత్రికేయులు కె.స్రవంతి చంద్ర, శశాంక్ మోహన్లు వివిధ అంశాలపై విజయనగరం జిల్లా జర్నలిస్టులతో వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి సమన్వయకర్తగా విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణారెడ్డి వ్యవహారించారు.
ఈ సంధర్బంగా రాష్ట్ర పురపాలకశాఖ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా వుండేలా జర్నలిస్టుల కమిటీలను ఏర్పాటు చేసి ఈ వృత్తిలో కొనసాగుతున్న వారికి వేతనాల స్థిరీకరణ,ఉద్యోగ భద్రతను కల్పించే దిశగా అంతా కలసి ముందుకు సాగాలంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు.
పాత్రికేయులు రాసే వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా లేకుండా ప్రజలకు మేలు కలిగే వార్తలపై ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు. జర్నలిస్టులకు ఆన్ లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న ప్రెస్ అకాడమీని ఇందులో పాల్గొన్న జర్నలిస్టులను అభినందించారు.
మెరుగైన సమాచారం అందించాలి
విజయనగరం జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్లాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలనతో పాటు ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ మెరుగైన సమాజం కోసం పాటు పడుతున్న జర్నలిస్టుల కృషిని కొనియాడారు.
ఎప్పుడు ఒకేలా కాకుండా కాలనుగుణంగా ఎప్పటికప్పుడు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం వుందని, ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవటానికి దోహదపడతాయని ఆయన అన్నారు.
ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని, మీడియా వ్యాపార,రాజకీయ,కుల, వర్గ ప్రయోజనాలకు సంబంధం లేకుండా మీడియా రంగం అభివృధ్ది చెందాల్సిన అవసరం వుందన్నారు. నైతిక విలువల్ని కోల్పోవాల్సిన పరిస్థితి రాకుండా జర్నలిస్టులు వ్యవహారించాలని కోరారు.
ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ జర్నలిస్టుల సంక్షేమాన్ని కోరుకుంటుందని అన్నారు. ఫేక్ జర్నలిస్టులను పూర్తి స్థాయిలో గుర్తిస్తే అసలైన జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పధకాలను సమర్ధవంతంగా అందించే అవకాశం వుంటుందని, ఇందు కోసం జర్నలిస్టుల యూనియన్ లు దృష్టి పెట్టాలని కోరారు.
జర్నలిజంలో మెళకువలు తెలియచేసే క్రమంలో ప్రెస్ అకాడమీ గ్రామీణ జర్నలిస్టులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తుందని అన్నారు. కరోనా నేపధ్యంలో ఏపీలో అన్ని జిల్లాల వారీగా ఆన్ లైన్ ద్వారా ఈ శిక్షణ తరగుతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వృత్తి జర్నలిస్ట్ లు నైపుణ్యాన్ని పెంపొందించు కునే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టి పుస్తకాలను రూపొందించామని వాటిని ప్రస్తుతం పీడీఎఫ్ ఫైల్స్ వృత్తి జర్నలిస్ట్ లకు ఆన్ లైన్ లో అందుబాటు లో ఉంచడం జరిగిందన్నారు.
దీనితో పాటు ప్రెస్ అకాడమీ రూపకల్పన చేస్తున్న వెబ్ సైట్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిక్షణలో భాగంగా సీనియర్ పాత్రికేయులు కె.స్రవంతి చంద్ర ‘క్షేత్ర సందర్శనే విలేకరి బలం – వాట్సాప్ జర్నలిజం నష్టం” అంశంపై మాట్లాడారు.
మరో సీనియర్ పాత్రికేయులు శశాంక్ మోహన్లు ‘వివిధ రకాల వార్తలు రాసే పధ్ధతులు : (వ్యవసాయ, విద్య, రాజకీయ, అభివృద్ధి, ప్రమాద, క్రైం)” అంశంపై విజయనగరం జిల్లా జర్నలిస్టులతో తన అనుభవాలను పంచుకున్నారు.