లాక్ డౌన్ సమయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు, ఖాళీగా ఉన్న జాగాలు కనిపిస్తే ఆక్రమిస్తున్నారు అని కడప జిల్లా నందలూరులో జరుగుతున్న ఈ తంతు చెబుతున్నది. నందలూరు మండలం చెన్నయ్య గారి పల్లె లో కె. సులోచన అనే ఒక 60 సంవత్సరాల మహిళకు సంబంధించిన స్థలంపై స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నేశారు.
ఆమె స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టేందుకు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవిశెట్టి లక్ష్మీనారాయణ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ప్రధాన అనుచరుడినని తనను ఎవరూ ఏమీ చెయ్యలేరని లక్ష్మీనారాయణ అంటున్నాడని స్థల యజమానులు చెప్పారు. స్థానిక పోలీసులకు కూడా వీరు ఈ విషయాన్ని ఫిర్యాదు చేశారు. న్యాయస్థానికి వెళ్లి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు.
అయినా కూడా స్థలాన్ని ఆక్రమించే కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణ విరమించుకోవడం లేదని సులోచన వాపోతున్నారు. లక్ డౌన్ సమయంలో అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం భూ ఆక్రమణలు చేస్తుండటం ఎంత వరకూ సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
తాజాగా లక్ష్మీనారాయణ తమ స్థలంలో ఆక్రమణకు వచ్చాడని సులోచన నందలూరు పోలీసులకు నేడు ఫిర్యాదు చేశారు. అదే విధంగా పోలీసులు ఉన్నతాధికారులకు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమ స్థలాన్ని కాపాడాలని తమకు న్యాయం చేయాలని సులోచన కోరుతున్నారు.