కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం పోటీ పడుతున్న లండన్ కు చెందిన ఆస్ట్రో జెనికా కంపెనీకి తీవ్ర అవరోధం ఏర్పడింది. ఆక్సస్ ఫర్డ్ యూనివర్సిటీ తో కలిసి ఆస్ట్రో జెనికా కరోనాకు మందును, వ్యాక్సిన్ ను తయారు చేయడంలో అన్ని కంపెనీల కన్నా ముందుకు వెళ్లింది.
అయితే ఈ కంపెనీ క్లీనికల్ ట్రయల్స్ లో అవరోధం ఏర్పడినట్లు వెల్లడి అయింది. కంపెనీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న ఒక వాలంటీర్ కు అంతు తెలియని ఒక రుగ్మత వచ్చినట్లు పరిశోధకులు కనుగొన్నారు. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఆస్ట్రో జెనికా కంపెనీ మూడో దశ కు చేరింది.
అంటే రాండమ్ గా వ్యక్తులను ఎంపిక చేసుకుని వ్యాక్సిన్ డోసు ను ఇస్తారు. ఇలా వ్యాక్సిన్ ఇచ్చిన ఒక వాలంటీర్ కు అస్వస్థత చేకూరడంతో క్లినికల్ ట్రయల్స్ అర్ధంతరంగా నిలిపివేశారు. ఈ మందు భద్రతా అంశాలను మరొక్క మారు పరిశీలించాల్సి ఉందని ఆస్ట్రో జెనికా ప్రకటించింది.
దీనికోసం నిపుణుల కమిటీని నియమించారు. క్లినికల్ ట్రయల్స్ లో ఈ విధంగా జరగడం సహజమేనని వారు అంటున్నారు. ఈ విధంగా అనుకోని రుగ్మత వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, మందును మళ్లీ విశ్లేషించాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఏ వాలంటీర్ కు ఈ విధమైన రుగ్మత వచ్చింది వివరాలు చెప్పలేమని కంపెనీ ప్రకటించింది. విశ్లేషణ పూర్తి అయిన తర్వాతే వివరాలు అందిస్తామని వారు అంటున్నారు.