భవిష్యత్తులో మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తానని కిలిమాంజారో పర్వత అధిరోహిని బాణోత్ వెన్నెల తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. 2022 సంవత్సరంలోనే తనకు కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించే అవకాశం వచ్చిందన్నారు. ఆ సమయంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా తనకు వెళ్లలేకపోయానని తెలిపారు. అనేకమంది ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ సంవత్సరం కూడా తనకు అవకాశం రావడంతో ఆర్థిక సహాయం కోసం అర్థించగా గ్రీన్ ఇండియా ఛాలెంజర్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తనకు ఆర్థికంగా సహాయం చేసారని చెప్పారు. దాంతో గత నెల 26 తేదీ గణతంత్ర దినోత్సవం రోజున 5895 మీటర్ల ఎత్తు, 19341 ఫీట్లు ఉన్న కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించడం జరిగిందని తెలిపారు. పర్వతం ఎక్కే సమయంలో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయినా పట్టుదలతో ముందుకు సాగానని చెప్పారు. కామారెడ్డి పేరును నిలబెట్టాలన్న కసితో వెళ్లి సాధించానన్నారు. అతి చిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. దానికి వివిధ నియోజకవర్గాల నాయకుల సహకారం కావాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ఎంజి వేణుగోపాల్ గౌడ్ పాల్గొన్నారు.
next post