చెంచు గిరిజన జాతి అనారోగ్య సమస్యలతో మృతి చెందుతున్నారని తమకు మెరుగైన వైద్య సేవలు అందించి కాపాడాలని కొమరం భీమ్ చెంచు గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షురాలు భూమని జెండాలమ్మ ఐటిడిఏ అధికారులను కోరారు.
శ్రీశైలం పరిధిలో ఉన్న హటకేశ్వరం చెంచుగూడెం నివాసి తుడు కుడుముల బయన్న (50) అటవీ ఉత్పత్తులను సేకరించి అమ్ముకొని జీవనాధారం సాగిస్తున్నాడు. ఇతనికి నలుగురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.
ఇతను నేటి మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతంలో రోడ్డు పక్కన ఉసిరికాయలు అమ్ముకుంటూ హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడని, వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఐటీడీఏ పి ఓకి విజ్ఞప్తి చేశారు.
కుడుముల బయన్న కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కొమరం భీమ్ చెంచు గిరిజన సంక్షేమ సంఘం కమిటీ గౌరవ అధ్యక్షుడు వై ఆశీర్వాదం, ఐ.ఎఫ్.టి.యు మండల అధ్యక్షుడు వై శ్రీను, కార్యదర్శి మల్లికార్జున, కొమరం భీమ్ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు గజల్, రాజు, నాగన్న, అంకమ్మ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.