గిరిజన, ఆదివాసి కుటుంబంలో జన్మించిన భద్రాచలం మాజీ శాసనసభ్యులు సున్నం రాజయ్య ఆదర్శ కమ్యూనిస్టు నాయకుడని సీ.పీ.ఐ.యం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం నాడు ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో జరిపిన రాజయ్య సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రజల కోసం నిరంతరం పని చేసే ప్రజా నాయకుడు కరోనా వైరస్ బారినపడి మరణించటం బాదాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో రాజయ్య తోపాటు మస్కు నర్సింహ, సీ.పీ.ఐ.యం నాయకులు షడ్రక్ మరియు ప్రజా కళా కారుడు,రచయిత వంగపండు లాంటివారు మృత్యువాత పడటం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు.
జీవితాంతం వారు చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు కరోనా కాలంలో లభించటంలేదని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి,సంతాపం తెలిపారు. ముందు గా సున్నం రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు . ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు జిట్ట నగేష్,మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, నాయకులు నారబోయ్న శ్రీనివాసులు, శీలా రాజయ్య తదితరులు పాల్గొన్నారు.