మహాత్మా జ్యోతిరావు ఫూలే 194వ జన్మ దినోత్సవ వేడుకలు విజయనగరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డీపీఓలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజకుమారి ముఖ్య అతిధిగా హాజరై, జ్యోతిరావు ఫూలే చిత్ర పటానికి పూలమాలలు, పూలను సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి మొట్టమొదటసారిగా కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే అని అన్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలో ఏప్రిల్ 11, 1827జన్మించిన జ్యోతిరావు ఫూలే ఒక సామాజిక కార్యకర్త అని ఎస్పీ అన్నారు
మేధావి, కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసి, బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో ఆత్మ సైర్యాన్ని, విశ్వాసాన్ని కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత సాధించేందుకు కృషి చేసిన మహనీయుడన్నారు.
కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం, కుల వ్యవస్థ నిర్మూలనకు, మహిళోద్ధరణకు కృషి చేసాడన్నారు. దిగువ స్థాయి వర్గాలకు ఎగువ స్థాయి వర్గాలతో సమాన హక్కులను కల్పించాలని ఉద్యమించి, అతని భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో మహిళా విద్యకు, తక్కువ కులాల ప్రజలకు విద్యను అందించేందుకు కృషి చేసారన్నారు.
బాలికల కోసం ప్రప్రధమంగా ఒక పాఠశాలను 1848లోనే పూనాలో ప్రారంభించి, మహిళా విద్యకు శ్రీకారం చుట్టారన్నారు. వితంతువుల కోసం ప్రత్యేకంగా ఒక గృహాన్ని కూడా స్థాపించి సామాజిక సంస్కర్తగా ఘనత వహించారన్నారు.
అటువంటి మహానుభావుడు జ్యోతిరావు ఫూలే చూపిన మార్గంలో పయనించి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ రాజకుమారి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సత్యన్నారాయణరావు, ఏఆర్ డీఎస్పీ ఎల్. శేషాద్రి, ఎస్బీ సీఐలు జి.రాంబాబు, ఎన్.శ్రీనివాసరావు, ఆర్ ఐలు చిరంజీవి, పి.నాగేశ్వరరావు, ఎస్ఐలు ధనుంజయ నాయుడు, అశోక్, కృష్ణ వర్మ, ఆర్ఎస్ఐ లు నర్సింగరావు, నారాయణరావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, జ్యోతిరావు పూలేకు పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.