40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని వివరిస్తూ రాష్ట్ర పార్టీ కార్యదర్శి కరణం అంబికా కృష్ణ రూపొందించిన ప్రత్యేక వీడియోను పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఆవిష్కరించారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 40 సంవత్సరాలు పూర్తయింది.
1982 మార్చి 29న నందమూరి తారక రామారావు హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీని ప్రకటించిన మహత్తరమైన రోజు ఇది అని ఈ సందర్భంగా కాట్రగడ్డ ప్రసూన తెలిపారు. సి.నారాయణ, నాదెండ్ల భాస్కరరావు, ఆదెయ్య, గద్దె రత్నయ్యలతో పాటు తాను కూడా ఆరంభ సభలో ప్రసంగించానని కాట్రగడ్డ ప్రసూన గుర్తు చేసుకున్నారు.
1983 ఏప్రిల్ 11న హైదరాబాద్ లోని నిజాం గ్రౌండ్స్ లో మొదట్టమొదటి మహానాడు జరిగిందని ఆమె తెలిపారు. బెజవాడ పాపిరెడ్డి, ఆనంద గజపతిరాజు, మహిపాల్ రెడ్డి వంటి వారితో బాటు తొలి మహానాడులో తాను కూడా ప్రసంగించిన విషయాన్ని కాట్రగడ్డ ప్రసూన గుర్తు తెచ్చుకున్నారు.
సినీ రంగంలో మకుటం లేని మహరాజులా వెలుగొందుతున్న నందమూరి తారకరామారావు ప్రజల కోసం రాజకీయాలలో కి వచ్చారని ఆమె తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారితో బాటు విద్యాధికులైన వారిని రాజకీయాలలోకి తీసుకువచ్చి రాజకీయాలకే కొత్త భాష్యం చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని ఆమె అన్నారు.
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అన్న మూల సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ పురోగమిస్తున్నదని ఆమె తెలిపారు. దార్శనికుడైన చంద్రబాబునాయుడి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరిన్ని కొత్త శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ తెలుగుదేశం కార్యకర్తలందరికి 40వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.