విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు
స్వాతంత్ర సమర యోధులు పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ జయంతిని పురస్కరించుకొని, విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు కార్యాలయం వద్ద ఆయన చిత్ర పటాలకు పూల మాలలు వేసి, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.
జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు ముఖ్య అతిధిగా హాజరై, డీపీఓ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు మాట్లాడుతూ – స్వాతంత్ర్య సమర యోధులు, త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, నాటక రంగానికి విశేష సేవలందించిన బళ్ళారి రాఘవల జయంతిని నిర్వహించుకోవడం, ఆంధ్రులుగా గర్వించదగ్గ విషయమన్నారు.
దేశంలో విభిన్న మతాలు, జాతులకు సమాన ప్రాధాన్యతను కల్పిస్తూ, అందరికి ఆమోదయోగ్యమైన త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా పింగళి వెంకయ్య రూపొందించారన్నారు. అదే విధంగా బళ్ళారి రాఘవ నాటక రంగం ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేయడమే కాకుండా విభిన్న పాత్రలను పోషించి, తన నటనా చాతుర్యంతో ప్రేక్షకులను మెప్పించే ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపారన్నారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా జాతీయ జెండాలతో భావోద్వేగ బంధాన్ని ఏర్పరిచే లక్ష్యంతో “ఇంటింటికి మువ్వన్నెల జెండా” కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటిపైనా ఈ రోజు 2 నుండి 15 వరకు విధిగా జాతీయ జెండాను ఎగుర వేసి, జాతీయ స్ఫూర్తి, భావాన్ని ప్రతీ ఒక్కరిలో రగిలించాలని ప్రజలకు అదనపు ఏఎస్పీ పి. సత్యన్నారాయణ రావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, ఏఆర్ అడ్మిన్ చిరంజీవి, ఆర్ ఐలు పి. నాగేశ్వరరావు, రమణమూర్తి ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.