గత ప్రభుత్వాలు పట్టాలు ఇస్తే నేటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోందని బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు.
శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామాన్ని సందర్శించి లబ్దిదారులతో మాట్లాడి అనంతరం లబ్దిదారులతో కలిసి పెబ్బేర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో 2003 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సర్వే నెంబర్లు 193,194,195,196 లలో 102 మంది బీసీలకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి పట్టాలు కూడా మంజూరు చేసిందని,కానీ పట్టాలిచ్చి 18 సంవత్సరాలు అవుతున్నా నేటికీ వారికిచ్చిన ప్లాట్లకు హద్దులు చూపకపోవటం ఎంత వరకు సమంజసమని అధికారులపై మండిపడ్డారు.
ప్రభుత్వం కావాలనే కుట్రపన్ని బీసీల భూములను లాక్కోవాలని చూస్తుందని,బీసీల భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
వారం పది రోజుల్లో లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్లకు హద్దులు చూపి సమస్య పరిష్కరించాలని,లేనిపక్షంలో కంచిరావుపల్లి నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహిస్తామని హెచ్చరించారు.
పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని, అవసరమైతే 102 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే స్పందించి గతంలో జారీచేసిన పట్టా భూముల్లో సంబంధిత లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలని ఆయన డిమాండ్ చేశారు.
పంతాలకు పోయి పట్టా భూములు లాక్కుంటామంటే పారిపోయేందుకు సిద్ధంగా లేమని, లబ్ధిదారుల పక్షాన పోరాటం చేసేందుకు తాను ముందువరుసలో ఉంటానని లబ్ధిదారులకు రాచాల స్పష్టమైన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఐ. సంరక్షణ కమిటీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర గౌడు, గ్రామ వార్డు నెంబర్ బాల గౌడ్, గ్రామ యువకులు విజయ్, కుమార్ నాయుడు, శ్రీకాంత్ వడ్డెర, లబ్ధిదారులు మందాడి విష్ణు, తెలుగు ఆంజనేయులు, కథలయ్య తెలుగు చిట్టెమ్మ, నందిమల్ల వెంకటస్వామి పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి