రాష్ట్ర ప్రభుత్వానికి అక్బరుద్దీన్ ఒవైసీ కేసు విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. విద్వేషాలను రగిల్చే ప్రసంగాలను చేసినట్లు ఆరోపణలు రావడతో పోలీసులు ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ పై కేసు పెట్టారు. అయితే ఆ కేసులను నాంపల్లి కోర్టు నేడు కొట్టివేసింది.
రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆధారాలను సమర్పించలేదని, అందుకే కోర్టు ఈ కేసును కొట్టేసిందని బండి సంజయ్ అన్నారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్కక్కయ్యరనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసును న్యాయ స్థానం కొట్టివేయడం విస్మయం కలిగిస్తోందని ఆయన అన్నారు.
15 నిమిషాలు సమయమిస్తే హిందువులందరినీ నరికి చంపుతామంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రపంచమంతా చూసింది. విన్నది. అయినా అక్బరుద్దీన్ ను నిర్దోషిగా ప్రకటించడం ఆశ్చర్యం కలుగుతోందని ఆయన అన్నారు.‘‘ ఈ విషయంలో మేం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టడం లేదు. కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించడం లేదు. ఎందుకంటే న్యాయ స్థానానికి కావాల్సింది ఆధారాలు, సాక్ష్యాలు. కానీ ప్రభుత్వమే వాటిని సమర్పించలేదు’’ అని ఆయన అన్నారు.
అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగడం ఎంఐఎం పార్టీకి అలవాటేనని బండి సంజయ్ విమర్శించారు. 2009లో అక్బరుద్దీన్ పై కేసు నమోదైతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంతో కుమ్కక్కై కేసును నీరుగార్చిందని ఆయన తెలిపారు. హిందూ దేవతలను అవమానపరుస్తూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై 2012లో నిజామాబాద్ లో నమోదైన కేసును బెన్ ఫిట్ ఆఫ్ డౌట్ కింద కోర్టు కొట్టివేసిందని ఆయన తెలిపారు.
‘‘కాంగ్రెస్-టీఆర్ఎస్-ఎంఐఎం కుమక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో ఆ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.