సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే,రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, టీఆర్ఎస్ నేత సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి 2:15 గంటలకు తుదిశ్వాస విడిచారు. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రామలింగారెడ్డి 1961లో మాణిక్యమ్మ, రామకృష్ణరెడ్డి దంపతులకు జన్మించారు. రామలింగారెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడు ర్యాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేశారు. రామలింగారెడ్డి దాదాపు పాతికేళ్ళ పాటు జర్నలిస్టుగా పని చేశారు. అప్పటి పీపుల్స్వార్ సంస్థతో సంబంధాలున్నాయనే నెపంతో ఆయనపై తొలిసారిగా టాడా కేసు నమోదు చేశారు. దేశంలోనే మొట్టమొదటి టాడా కేసు రామలింగారెడ్డిపై నమోదు కావడం గమనార్హం.టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పని చేశారు. ఆయనపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. 2004లో రామలింగారెడ్డి రాజకీయరంగ ప్రవేశం చేశారు. జర్నలిస్టుగా పనిచేసిన రామలింగారెడ్డి 2004లో మొదటి సారిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2008 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. రామలింగారెడ్డికి భార్య, కూమారుడు, కుమార్తె ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి అంచనాల కమిటీ చైర్మన్ పదవి చేపట్టిన ఆయన మృతితో దుబ్బాక లో విషాదఛాయలు అలుముకున్నాయి.
next post