మేయర్ ఎన్నిక కోసం బీజేపీ కార్పొరేటర్లను అధికార టీఆర్ఎస్ పార్టీ ఐదు కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తామని ఆఫర్ల మీద
ఆఫర్లు వెదజల్లుతోందని బీజేపీ (భారతీయ జనతా పార్టీ) రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత కూడా కేసీఆర్లో ఏ మాత్రం అహంకారం తగ్గలేదని తద్ఫలితమే లంచాలిచ్చి ఇతర పార్టీ కార్పొరేటర్లను కొనేందుకు చూడడమే నిదర్శమని దుయ్యబట్టారు. ఎందరు చెబుతున్నా అంత హడావిడిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏం వచ్చిందో? అని బండి ప్రశ్నించారు. ఎన్నికల అనంతరం బీరాలు పలికిన టీఆర్ఎస్ నాయకులంతా ఎక్కడ ఉన్నారని ఇప్పటివరకూ మేయర్ ఎన్నికను ఎందుకు చేపట్టలేకపోతున్నారో? ప్రజలకు సవివరంగా చెప్పాల్సిన అవసరం ఏంతైనా ఉందని అన్నారు. గురువారం నాడు ఖమ్మంలో పర్యటించిన బండి సంజయ్ పై విధంగా ఆరోపణలను చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.
కొత్తగూడెం ఘటన సంగతి ఏంటీ?
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం, వరంగల్, సిద్దిపేట కార్పొరేషన్ చాలామంది నాయకులు బీజేపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆయా జిల్లాల్లో ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసి గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. కొత్తగూడెం ఘటన బయటకు రాకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసులకు అప్పగిస్తే తడాఖా చూపిస్తారు!!!
తెలంగాణ పోలీసులు విధి నిర్వహణలో ఎంతో ఔచిత్యాన్ని ప్రదర్శించినా వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం అణగదొక్కుతోందన్నారు. వారికి ఓ పదిహేను నిమిషాలు గనుకసమయం కేటాయించి పాతబస్తీని (హైదరాబాద్) అప్పగిస్తే అంతా జల్లెడ పట్టి ద్రోహులను, దోషులలను తరిమి కొడతారన్నారు. ఓల్డ్ సిటీలో దాగి ఉన్నరోహింగ్యాలు, పాకిస్తానీలను బయటకు తీస్తారని వారిపై ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని వారి విధులు వారు నిర్వహించుకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని? ప్రశ్నించారు. టీఆర్ఎస్కు దమ్ముంటే ఒక్క పదిహేను నిమిషాలు తెలంగాణ పోలీసులకు సమయం ఇచ్చి చూడాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.