టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీనరీ వేదికగా ప్రకటించారు. అనంతరం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయి అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దళిత బంధు ప్రకటించాక ఆంధ్ర నుంచి వేల విజ్ఞాపనలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని చెబుతున్నారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారు. తెలంగాణలో మంచి పథకాలు అమలవుతున్నాయని, ఆ రాష్ట్రంలో మమ్మల్ని కూడా కలపాలని కోరుతూ నాందేడ్, రాయచూర్ జిల్లాల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు వచ్చి పని చేస్తున్నారు. దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడిస్తోందన్నారు.
కేసులతో అభివృద్ధిని అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. సాహసం లేకుండా ఏ కార్యం సాధ్యం కాదు. కలలు కని.. ఆ కలలనే శ్వాసిస్తే సాకారమవుతాయి. తెలంగాణలో అద్భుతంగా వ్యవసాయ స్థీరీకరణ జరిగింది. మనం విడిపోయిన ఏపీ తలసరి ఆదాయం రూ. 1.70 లక్షలే. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2.35 లక్షలకు పెరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంట్ సమస్యలు వస్తాయని కొందరు ఏపీ నేతలు అపోహలు సృష్టించారు. కానీ తెలంగాణలో 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఆంధ్రాలో 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమవుతందని సీఎం కేసీఆర్ అన్నారు.
పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ మొత్తం 18 సెట్ల నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. పార్టీలోని అన్ని విభాగాలు, అన్ని సామాజికవర్గాల నేతలు కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలుచేశారు. అధ్యక్ష పదవికి ఇతరులెవ్వరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో కేసీఆర్ ఎన్నిక ప్రకటన ఏకగ్రీవమైంది.
పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఇప్పటివరకు వరుసగా ఎనిమిదిసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇది 9వ సంస్థాగత ఎన్నిక. చివరిసారిగా 2017లో రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. 2019లో పార్లమెంట్ ఎన్నికలు, 2020, 2021లో కరోనా కారణంగా పార్టీ ప్లీనరీ నిర్వహించలేదు.