ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందిన వెంటనే జాబ్ నోటిఫికేషన్లను జారీ చేయడానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సిద్ధమవుతోంది. దీనికి అవసరమైన అన్ని చర్యలను అధికారులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సిలబస్ ను అప్డేట్ చేయడంతోపాటు పరీక్షలను నిర్వహించాల్సిన విధానంపై దృష్టి సారించారు. మరోవైపు నిపుణుల కమిటీ రూపొందించిన సిలబస్ ఆధారంగా అభ్యర్థులకు పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడానికి తెలుగు అకాడమీ అధికారులు కృషి చేస్తున్నారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటిలో గ్రూప్-1 వంటి ఉన్నత స్థాయి పోస్టులు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు గ్రూపు-1 ఉద్యోగాలను భర్తీ చేయలేదు. తొలిసారిగా ఇప్పుడు భర్తీ చేయబోతున్నారు. దీంతో ఈ నియామకాలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సిలబస్ను రూపొందించింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం 2015లో వివిధ రంగాల నిపుణులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి, నియామక పరీక్షలకు సంబంధించిన సిలబస్ను ఖరారు చేశారు. తాజాగా భర్తీ చేయనున్న పోస్టులకు కూడా ఈ సిలబస్ తోనే పరీక్షలను నిర్వహించనున్నారు. అందువల్ల గతంలో పేర్కొన్న సిలబస్ నే అభ్యర్ధులు ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే సిలబస్ ను ఆధారంగా చేసుకుని తెలుగు అకాడమీ పుస్తకాలను ముద్రించింది. ఈ పుస్తకాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవసరాన్ని బట్టి వీటిని మళ్లీ ముద్రించాలని తెలుగు అకాడమీ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని పుస్తకాల్లో సమకాలీన అంశాలను చేర్చాల్సి ఉంటుంది. వాటిపై ప్రస్తుతం దృష్టి పెట్టారు.
గ్రూపు-1, 2 ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు బాగా ఉపయోగపడే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ – అభివృద్ధి పుస్తకాల ముద్రణ కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలున్నాయి. ఈ మేరకు తెలంగాణ జాగ్రఫీ సిలబస్ లో మార్పులు, చేర్పులను చేయాల్సిన అవసరం ఏర్పడింది. తాజా అంశాలతో తెలంగాణ భూగోళ శాస్త్రం (జాగ్రఫీ) సిలబస్ ఇప్పటికే ఖరారైంది. దీనికి సంబంధించిన పుస్తకాల ముద్రణకు కూడా అధికారులు ఆర్డర్ ఇచ్చారు. తెలుగు అకాడమీ ప్రచురిస్తున్న ఈ పుస్తకాలు వారం, పది రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు ఉపయోగపడే తె లుగు అకాడమీ పుస్తకాలను హైదరాబాద్తోపాటు సిద్దిపేట, సంగారెడ్డి, వరంగల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచారు.
గ్రూప్-1 ఉద్యోగాలకు మొత్తం 1,000 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. ప్రిలిమిన రీ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్) పేపర్కు 150 మార్కులు ఉంటాయి. అనంతరం మెయిన్ పరీక్షల్లో భాగంగా జనరల్ ఇంగ్లిష్కు 150 మార్కులు ఉంటాయి. ఇవి అర్హత పరీక్షలు మాత్రమే. వీటిలో సాధించే మార్కులను ర్యాంకింగ్లో పరిగణనలోకి తీసుకోరు. ఆ తర్వాత పేపర్-1లో జనరల్ ఎస్సే, పేపర్-2లో చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ; పేపర్-3లో ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం – పరిపాలన; పేపర్-4లో ఎకానమీ అండ్ డెవల్పమెంట్; పేపర్-5లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రెటేషన్; పేపర్-6లో తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఏర్పాటు అంశాలపై పరీక్షలు ఉంటాయి. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇంటర్వ్యూకి మరో 100 మార్కులు ఉంటాయి.
గ్రూపు-2 ఉద్యోగాలకు 675 మార్కులను ఖరారు చేశారు. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్కులకు ఉంటుంది. పేపర్-2లో మూడు పరీక్షలు ఉంటాయి. ఇవి… 1. హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ 2. ఎకానమీ అండ్ డెవల్పమెంట్ 3. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు. వీటిలో ఒక్కో పరీక్షకు 150 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇంటర్వ్యూకి మరో 75 మార్కులు ఉంటాయి.
గ్రూప్-3 ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 450 మార్కులకు పరీక్షలు జరుగుతాయిఇందులో జనరల్ స్టడీస్ – సాధారణ సామర్థ్యాలు పేపర్కు 150 మార్కులు; చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం పేపర్కు 150 మార్కులు; ఆర్థిక వ్యవస్థ – అభివృద్ధి పేపర్కు మరో 150 మార్కులు ఉంటాయి. గ్రూప్-4 ఉద్యోగాలకు 300 మార్కులకు పరీక్షలు ఉంటాయి. ఇందులో జనరల్ నాలెడ్జ్కి 150 మార్కులు, సెక్రటేరియల్ ఎబిలిటీస్ పేపర్కు 150 మార్కులు ఉంటాయి.