30.2 C
Hyderabad
September 28, 2023 14: 10 PM
Slider తెలంగాణ

పదోన్నతుల కోసం విద్యా మంత్రికి టిఎస్పిటిఎ వినతి

tspca

విద్యాశాఖలో గత నాలుగు సంవత్సరాలుగా నిలిచిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులను వెంటనే ఇవ్వాలని  టిఎస్పిటిఎ కోరింది. ఈ మేరకు షెడ్యూల్ జారీ చేయాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందచేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ, ప్రధాన కార్యదర్శి నాగనమోని చెన్నరాములు నాయకత్వంలో మేడ్చెల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి నిర్మల, ఎస్ లక్ష్మీకాంత రెడ్డి, అదనపు ప్రధాన కార్యదర్శి  ఎ కరుణాకర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు ఎం.మంగ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా పదోన్నతులు లేక పోవడం వల్ల ఇప్పటికే పదివేల మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేసేశారని, దానివల్ల తీవ్రంగా నష్టపోయారని వారు మంత్రికి వివరించారు. ఈ సమస్య పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు చొప్పున నియమించాలని, ప్రతి పాఠశాలలో హెచ్ ఎం పోస్టులు మంజూరు చేసి భర్తీ చేయాలని వారు మంత్రిని కోరారు. దానిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి కృతనిశ్చయంతో ఉందని, ఏకీకృత సర్వీసులు అమలు చేయడం ద్వారా  పదోన్నతులు కల్పించాలని భావించామని, న్యాయ పరమైన సమస్యలతో కాలయాపన జరుగుతుందని తెలిపారు. ఆ సమస్యకు పరిష్కారం లభించేంత వరకూ యాజమాన్యాల వారిగా పదోన్నతులు కల్పించడంలో ఎటువంటి ఇబ్బందులూ లేవని, ఆ మేరకు ముఖ్యమంత్రి తో చర్చించి అక్టోబర్ చివరి వరకు షెడ్యూల్ జారీ చేయటం కొరకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. జాతీయ అక్షరాస్యత అభివృద్ధిలో మన రాష్ట్రం వచ్చే గణాంకాల నాటికి ప్రధమంగా నిలవడం లక్ష్యంగా కార్యాచరణను ప్రకటిస్తామని, దానికి ఉపాధ్యాయులు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న పరిపాలన పరమైన సమస్యలను గుర్తించామని, వాటిని నిర్ధిష్టమైన పద్దతిలో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Related posts

ఆస్తి విలువ పై ఇంటి పన్ను వేసే విధానాన్ని రద్దు చేయాలి

Satyam NEWS

గూగుల్ పై జరిమానాను సమర్థించిన సెకండ్ కోర్టు

Satyam NEWS

ఆటకు పేదరికం అడ్డుకాకూడదు : ఒలింపిక్ అధ్యక్షులు బి.జి.ఆర్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!