మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల ప్రయాణ సౌకర్యార్థం రాష్ట్రములోని అన్ని ప్రధాన శివాలయాలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. మంగళవారం శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ సూచనలతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాటు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
ముఖ్యంగా వుమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల పరిధిలోని అన్ని శైవ క్షేత్రాలకు సోమవారం నుండే ఆర్టిసి బస్సులు నడుపుతున్నది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి జాతరకు విచ్చేసే భక్తుల కొరకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. తెలంగాణ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా మూడురోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి.
జాతరకు 770 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతుండగా తిప్పాపూర్ నుంచి కట్ట బస్టాప్ వరకు 14 ఉచిత బస్సులను అధికారులు సిద్ధం చేశారు. అలాగే వుమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప, కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, ఖమ్మం జిల్లాలోని తీర్ధల ప్రాంతాలకు ఆర్టిసి ఎక్కువ బస్సులను తిప్పనున్నది.