తిరుమల తిరుపతి దేవస్థానం రెండు రోజుల పాటు మూతపడనుంది. సూర్యగ్రహణం కారణంగా 13 గంటల పాటు స్వామి వారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. డిసెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ శుద్ధి అనంతరం రెండు గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
సూర్యగ్రహణం కారణంగా డిసెంబర్ 25, 26 తేదీల్లో 13 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. సూర్యగ్రహణం కారణంగా డిసెంబర్ 26 ఉదయం 8.08 గంటల నుంచి ఉదయం 11.16 వరకు ఆలయం మూతపడనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందు బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేస్తారు.
26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తలుపులు తెరిచి ఆలయ శుద్ధి అనంతరం రెండు గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. 26న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. శ్రీవారి భక్తులంతా ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే, శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా ఉంది.
వైకుంఠం కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పట్టగా, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది.