తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న ఉద్యోగులు దారుణమైన మానసిక వత్తిడిలో ఉన్నారు. పని వత్తిడి ఉండటాన్ని ఎవరూ తప్పుగా తీసుకోరు. పని చేయకుండా జీతం ఇవ్వమని కూడా ఎవరూ అనరు. అయితే ఏవో కారణాలు చూపించి వేధిస్తుంటే నే సిబ్బందికి మానసిక వత్తిడి పెరిగిపోతుంది.
ఇలా తిరుమలలోని టిటిడి చైర్మన్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా చేరి నెల తిరగక ముందే బదిలీ అయిన ఉమా శంకర్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యంత దురదృష్టకరమైన ఈ సంఘటన తిరుమల కొండపై తీవ్ర సంచలనం కలిగించింది.
గతంలో తిరుమల జేఈవో ఆఫీస్ లో పనిచేసిన సురేష్ అనే వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అదే విధంగా ఇప్పుడు ఉమా శంకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు సంఘటనలపై పలు అనుమానాలు నెలకొంటున్నాయి. టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఆఫీస్ నుంచి ఉమా శంకర్ రెడ్డి ని ఉన్నపళంగా ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
అతని బదిలీకి కారణాలు ఏమిటి?బాధ్యులు ఎవరు? టిటిడి చైర్మన్ ఆఫీస్ నుంచి ఉమా శంకర్ రెడ్డి ని బదిలీ చేసి అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టింది ఎవరు? అనే ప్రశ్నలకు సంబంధిత వ్యక్తులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాయితీగా తన పని తాను చేసుకుని వెళ్లే ఉమా శంకర్ రెడ్డి ఆత్మహత్య పై టీటీడీ సమగ్ర విచారణ జరిపించాలని, దీనికి బాధ్యులు ఎంతటి ఉన్నతాధికారి అయినా శిక్షించాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఉన్నతాధికారులు వేధిస్తే తిరగబడాలి కానీ మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడకండని ఆయన కోరారు. తిరుమలలో జరిగే అవినీతి కార్యక్రమాలను ఆపేందుకు నిజాయితీ గల సిబ్బంది అవసరమని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుమల దేవుడికి అన్యాయం జరగకుండా కాపాడేందుకు నిజాయితీ గల టీటీడి సిబ్బంది మొత్తం కదలి రావాలని ఐకమత్యంతో ఉన్నతాధికారులను నిలదీయాలి తప్ప అర్ధంతరంగా ప్రాణాలు వదలవద్దని నవీన్ కుమార్ రెడ్డి కోరారు.