తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను డిపాజిట్ల రూపంలో తమ వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రైవేట్ బ్యాంకుల్లో వేయడం అత్యంత ప్రమాదకరమని “ఎస్” బ్యాంకు ఉదంతంతో నైనా టీటీడీ ఈవో,ప్రధాన గణాంకాధికారికి కనువిప్పు కలగాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
“ఎస్” బ్యాంక్ నుంచి 1300 కోట్ల శ్రీవారి డిపాజిట్లను ఆఖరు నిమిషంలో ఉప సంహరించుకున్నారు కానీ లేకపోతే స్వామివారి సొమ్ము ఇరుక్కుపోయి ఉండేదని ఆయన అన్నారు. శ్రీవారి నిధులకు అధికవడ్డీ వస్తుందని ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారని దీని వెనుక కమీషన్ల భాగోతం కూడా నడుస్తున్నదని ఆయన నిశితంగా విమర్శించారు.
ప్రైవేట్ బ్యాంకులు దివాలా తీస్తే శ్రీవారి డిపాజిట్లకి టీటీడీ ఈవో, ప్రధాన గణాంక అధికారి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. టిటిడి ఉన్నతాధికారుల సొమ్ము మాత్రం భద్రంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు వేసుకొని వెంకన్న సొమ్ము మాత్రం నిర్లక్ష్యంగా ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటం ధర్మమా అని ఆయన ప్రశ్నించారు.
టిటిడి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళక ముందే ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు ఐఆర్ఎస్ స్థాయి అధికారిని టీటీడీలో నియమించేలా ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు.
శ్రీవారి నిధులు గత సంవత్సరం ఇండస్ ఇండ్ బ్యాంక్ లో రూ.1,000 కోట్లు డిపాజిట్ వేస్తే తాను శ్రీవారి భక్తునిగా హైకోర్టును ఆశ్రయించానని, హైకోర్టు సైతం శ్రీవారి సొమ్ముకు భద్రత ముఖ్యం తప్ప వడ్డీ కాదు అని హెచ్చరించిందని ఆయన తెలిపారు. అయినా టిటిడి ఉన్నతాధికారులలో మార్పు రాకపోవడం శ్రీవారి డిపాజిట్ల భద్రత పట్ల వారికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీవారి వేలకోట్ల సొమ్మును ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం వెనుక ఉన్న మతలబు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.